ఇకపై దేశంలోని రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డును అందజేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా రైతుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు (ఐడీ) రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదున్నర కోట్ల మంది రైతుల డేటాబేస్ను సిద్ధం చేశామని వాటి ఆధారంగా 12 అంకెల గుర్తింపు కార్డులను అందజేస్తామని కేంద్రం తెలిపింది. ఇకపై ఈ ఐడీ కార్డులతోనే రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతారు. డేటాబేస్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక అమలు చేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆయా పధకాలు లభ్యమయ్యేట్టుగా ముందు ముందు ఆదేశాలు జారీ చేయనున్నారు.
దీని ద్వారా ఆయా రైతుల గుర్తింపు ఆన్ లైన్ చేయబడుతుంది కాబట్టి ప్రతిసారి ఆయా ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఇక ఉండదు. ఒక్కసారి ఈ కార్డులో వాళ్ళ ధ్రువీకరణ పత్రాల సమాచారం పొందుపరచడంతో ప్రతిసారి ఆయా పధకాలు నేరుగా ఆయా రైతులకు చేరిపోతాయి. దేశం లో 11.5 కోట్ల రైతులు ఉండగా అందులో 5.5 కోట్ల మంది సమాచారం ఇప్పటికే సేకరించడం జరిగింది. ఇప్పటికే ప్రధాన మంత్రి కళ్యాణ్ నిధి పొందుతున్న రైతుల అందరికి ఈ కార్డులు జారీచేస్తారు. వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర తోమర్ లోక్ సభలో ఈ వివరాలు వెల్లడించారు.