దేశంలో మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. యమునా నదిపై జలమార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా త్వరలో మధుర-బృందావన్ లను క్రూయిజ్ సర్వీస్తో అనుసంధానం చేస్తామని కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.
ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ అండ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ సేవ ఆగ్రాకు వెళ్లేవారిని మథురకు వచ్చి సందర్శించడానికి ఆకర్షిస్తుందని సోనోవాల్ అన్నారు. యమునా నదిపై జలమార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా గోకుల్, మధుర సహా బృందావన్ లను కలుపుతామని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో కేంద్రం చేపట్టిన ‘హర్ ఘర్ జల్’ ప్రాజెక్టు పురోగతిపై ఇప్పటికే తమ శాఖ అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.