కాంగ్రెస్ అధ్యక్షరేసులో ముందునుంచీ పేరు వినిపిస్తున్న అశోక్ గెహ్లాట్ కు అధిష్టానం చెక్ పెట్టింది. సాయంత్రం ఢిల్లీ వచ్చిన తననుకలిసిన గెహ్లాట్ ను గట్టిగానే మందలించినట్టు సమాచారం. అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ రాజస్థాన్లో పరిణామాలు పార్టీకి కొత్తతలనొప్పులు తెచ్చిపెట్టిందని మండిపడినట్టు తెలిసింది. తనకేం సంబంధం లేదని చేతులెత్తేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో అసమ్మతినే కంట్రోల్ చేయలేని నాయకుడిగా జాతీయస్థాయిలో పార్టీని ఎలా నడుపుతారని ప్రశ్నించినట్టు తెలిసింది. తన నమ్మకాన్ని వమ్ముచేశారనీ సోనియా బాధను వ్యక్తం చేసినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
సోనియాతో భేటీ తరువాత తాను అధ్యక్షరేసులో లేనని గెహ్లాట్ చెప్పడం గమనార్హం. అంతేకాదు తాను సీఎంగా కొనసాగేదీ లేనిదీ సోనియా నిర్ణయిస్తారనీ అన్నారు. అయితే పార్టీపట్ల నిబద్ధతతో ఉంటానని… సోనియా, రాహుల్ ఆదేశానుసారం మెదులుతానని అన్నారు గెహ్లాట్.
గెహ్లాట్ తో సమావేశం ముగిసిన కొద్దిసేపటికి సోనియాతో సచిన్ పైలట్ భేటీ అయ్యారు. తో ఆయనను సీఎం పదవినుంచి తొలగించవచ్చనే ప్రచారం ఊపందుకుంది.
అటు పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 30 ఆఖరిరోజు. దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ పోటీలో ఉంటారని స్పష్టమైంది. ఈ సారి గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి కాక…బయటివారికి అధ్యక్షబాధ్యతలు ఇవ్వాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. అందుకే సోనియా, రాహుల్ ఈసారి పోటీలో ఉండడం లేదు. అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది.