పూర్వవైభవం పొందే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేయనుంది. అందులో భాగంగా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టబోతోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలే ఎజెండాగా జూన్ 15 నుంచి అన్ని జిల్లాల్లో జనజాగరణ్ యాత్ర 2వ దశ ప్రారంభించనున్నట్లు రాజస్థాన్ ఉదయ్ పూర్లో మూడ్రోజులపాటు జరిగిన నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ పేరిట జరిగిన మేథోమథన సదస్సు వేదిగ్గా సోనియాగాంధీ ప్రకటించారు. 450 మందికిపైగా ప్రతినిధులు విస్తృతంగా చర్చించిన అంశాలను క్రోడీకరించి ‘ఉదయ్పూర్ డిక్లరేషన్’ పేరిట ఆమోదించింది పార్టీ.
అక్టోబరు 2న గాంధీ జయంతి నుంచి ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించనున్నారు. ఏడాదిపాటు యాత్ర సాగనుంది.
ఇక దూరమైన అన్ని వర్గాల ప్రజలను దగ్గర చేసుకునే పనిలో పడింది. అన్ని స్థాయుల పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఇస్తున్న 20 శాతం ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని, ఉపకులాలకు కూడా అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చింతన్ శిబిర్ నిర్ణయించింది. ప్రభుత్వ రంగంలో ఉపాధి తగ్గిపోతున్నందున ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్కు మద్దతివ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బి ల్లు కోసం పోరాడాలని.. బలహీనవర్గాలు, మైనారిటీలకు ఇచ్చే కోటాలో మహిళలకూ ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించింది.
అంతేకాదు 2024 నుంచి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సగం టికెట్లు 50ఏళ్ల లోపు వారికి ఇవ్వాలని తీర్మానించింది పార్టీ. ఇక గాంధీ కుటుంబానికి మినహాయింపునిస్తూ ఒకే కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.
కుటుంబంలో మరొకరికి టికెట్ కావాలనుకుంటే వారు కనీసం ఐదేళ్లు పార్టీలో క్రియాశీలంగా పనిచేసి ఉండాలనే నిబంధన జోడించనుంది. ప్రజాభిప్రాయ సేకరణకు పబ్లిక్ ఇన్సైట్స్ విభాగం, జాతీయ స్థాయి లో పార్టీ సభ్యులకు శిక్షణ సంస్థ, ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడురోజుల చింతన్ శిబిర్ పట్ల పార్టీ సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.