తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్ పై గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ నేపథ్యంలో కాంగ్రెస్ పై , సోనియాగాంధీపై విరుచుకుపడింది బీజేపీ. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి సీఎం మోదీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని సోనియా ప్రయత్నించిందని పార్టీ ఆరోపించింది. అటు గుజరాత్ అల్లర్లలో మోదీ ప్రమేయం లేదని గత నెలలో సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్ల కేసును రగిలించేందుకు పదే పదే పిటిషన్లు వేస్తున్నారని… వారిపై చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలనీ ఆదేశించడంతో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ను, నాటి పోలీసు ఉన్నతాధికారి శ్రీకుమార్ ను గుజరాత్ సిట్ అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆమెకు బెయిలు ఇవ్వవద్దంటూ సిట్ ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కీలకాంశాలు ఆధారాలతో ఉన్నాయి. నాటి మోదీ సర్కారును కూల్చేసేందుకు అహ్మద్ పటేల్ పన్నిన కుట్రలో తీస్తా భాగస్వామి అని ఆరోపించింది. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ సీనియర్,కీలక నేతగా ఉండి..సోనియాకు సలహాదారుగా పనిచేశారు. దీంతో సోనియాను లక్ష్యంగా చేసుకుంది బీజేపీ. అహ్మద్ పటేల్ను వాడుకుని గుజరాత్ ప్రతిష్ఠను మసకబార్చేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారన్నారు. బీజేపీ, మోదీల ప్రతిష్ఠను మసకబార్చేందుకు, రాహుల్ గాంధీకి రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ కుట్ర పన్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. అందుకు కోట్లు ఖర్చు చేసినట్టు ఆరోపిస్తున్నారు.
అయితే బీజేపీ నేతల ఆరోపణల్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్. అహ్మద్ పటేల్ పై సిట్ ఆరోపణలను ఖండించింది. తన హయాంలో జరిగిన మతపరమైన అల్లర్లకు బాధ్యత వహించకుండా తప్పించుకునేందుకు కుట్రప్రకారం పన్నుతున్న వ్యూహమంటూ మండిపడింది. సిట్ తన రాజకీయ యజమాని బాణీలకు అనుగుణంగా ఆడుతోందని ఆరోపించింది కాంగ్రెస్.