నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని కాంగ్రెస్ మద్దతు గల యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మూడో రౌండ్ విచారణకై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. నిన్న సోనియాను దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించగా, రేపు మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసినందుకు వ్యతిరేకంగా నిన్న నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఇతర పార్టీ సీనియర్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ ప్రశ్నలకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వైపు కవాతు నిర్వహించారు.
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఆమె ప్రమేయం గురించి దాదాపు 30 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సోనియా గాంధీని కోరినట్లు అధికారులు తెలిపారు.