కిమ్ నియంతృత్వ పాలనలో నార్త్ కొరియన్లకు కొత్త కష్టం వచ్చింది. ఇప్పుడు ఆదేశంలో నవ్వితే నేరం . అంతేకాదు ఎవరూ సంతోషంగా గడపొద్దు, ఆల్కహాల్ సేవించవద్దు, పుట్టినరోజు వంటి వేడుకలూ చేసుకోవద్దని అధినేత కిమ్ ఉన్ ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుతం దేశంలో ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 11 రోజుల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ను ఈ కాలపు తుగ్లక్ అనవచ్చు. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఇక తాజాగా తన తండ్రి పదో వర్దంతి సందర్భంగా కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నార్త్ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోన్ ఇల్ చనిపోయి పదేళ్లు. ఆయన స్మరణార్థం దేశంలో 11 రోజుల పాటు సంతాపదినాలు పాటించాలని
కిమ్ ఉన్ నిర్ణయించారు. ఈ 11 రోజులూ ఎవరూ సంతోషంగా ఉండవద్దని ఆదేశించాడు జూనియర్ కిమ్.‘ ఈ 11 రోజులు దేశంలో మద్యం సేవించడం, నవ్వడం, వేడుకల్లో పాల్గొవడం నిషేధం’ అని ఉత్తర కొరియా ఈశాన్య సరిహద్దు నగరం సినౌజులో రేడియో ఫ్రీ ఆసియా ప్రకటించింది.
వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో ఉంటాడు కిమ్. కరోనా కారణంగా దేశంలో ఆహారోత్పత్తి తగ్గినందున దేశ ప్రజలంతా తక్కువ తినాలని కొద్ది రోజుల క్రితం ఆదేశించాడు . 1994 నుంచి 2011 వరకు 17 ఏళ్ల పాటు ఉత్తర కొరియాను ఏలిన కిమ్ ఉన్ తండ్రి… కిమ్ జోంగ్ ఇల్ కూడా నియంతలానే వ్యవహించాడు. 2011లో ఇల్ గుండెపోటుతో చనిపోయాడు. తండ్రినుంచి అధికారంతో పాటు నియంతృత్వ పోకడనూ అందిపుచ్చుకున్నాడు ఉన్. గతంలో సంతాపదినాల సందర్భంగా వేడుకలు చేసుకుంటూ ఆనందంగా గడిపిన వాళ్లని అరెస్ట్ చేసి హింసించారు. వారిలో కొందరి ఆచూకీ ఇంకా లభించలేదు.
ప్రతిసంవత్సరం 10 రోజులు సంతాపదినాలు నిర్వహించేవారు..కానీ పదేళ్లు పూర్తైన సందర్భంగా ఈసారి 11 రోజులు సంతాపదినాలు పాటిస్తూ ఆదేశించాడు కిమ్.