కర్నాటకలో బజరంగదళ్ కార్యకర్త హర్ష హత్యకేసులో ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, ఆసిఫ్, రిహాన్ గా గుర్తించారు. అంతా ఇరవై ఏళ్లలోపు వాళ్లేనని తెలిసింది. ఆదివారం రాత్రి శివమొగ్గ భారతీనగర్లో హర్షను దుండగులు హత్యచేసిన సంగతి తెలిసిందే. కారులో వచ్చిన ఏడుగురు ఆతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి చంపారు.
హర్ష హత్యతో పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హత్యను నిరసిస్తూ, న్యాయం కోరుతూ పెద్ద సంఖ్యలో యువత, హిందూ సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో ప్రత్యేక బలగాల్ని మోహరించారు. ప్రస్తుతం ఇంకా అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. అటు అడిషనల్ డీజీపీ ప్రతాప రెడ్డి శివమొగ్గలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హంతకుల్లో కొందరిని పట్టుకున్నామని..మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
హర్ష హత్యతో శివమొగ్గలో మొదలైన అల్లర్లు…పరిసర ప్రాంతాలకు విస్తరించాయి. పోలీసులు ఎక్కడికక్కడ అందర్నీ అడ్డుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. హిజాబ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందునే హర్షను హత్య చేశారని నిర్థారణ కావడంతో హిజాబ్ వివాదం వెనక ఉన్నదెవరు? మత సంస్థల పాత్ర ఏంటి…నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి.. హర్ష హంతకులు వాడిన వాహనం ఎవరిది అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
హర్ష హంతకులను అరెస్ట్ చేసి శిక్షపడేలా చేస్తామని కర్నాటక హోంమంత్రి హామీ ఇచ్చారు. హర్ష హత్య చివరిది కావాలని తాము కోరుకుంటున్నామని…ప్రశాంత వాతావరణం ఏర్పడేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హర్ష అంతిమ యాత్ర సందర్భంగా రాళ్లు రువ్విన వారిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. విద్యాసంస్థల్లో జిహాదీని వ్యతిరేకిస్తున్నందునే హర్షను హత్య చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా పలువురు ఆరోపించారు. హిజాబ్ ఉద్యమం వెనక, హర్ష హత్య వెనక పెద్ద కుట్ర ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అటు శివమొగ్గ జిల్లాలో కర్ఫ్యూను పొడిగించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)