ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల అసలు పేరు చెంబోలు సీతారామశాస్ర్తి . ఆయన మొదటిసారి సిరివెన్నెల సినిమాకు పాట రాశారు..దాంతో ఆయన పేరు సిరివెన్నెలగా స్థిరపడిపోయింది.
1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి డాక్టర్. సి.వి.యోగి సుబ్బలక్ష్మి దంపతులకు సిరివెన్నెల జన్మించారు. ఆంధ్రా విశ్వకళా పరిషత్లో బి.ఎ.పూర్తి చేశారు. ఎం.ఏ చదువుతున్న సమయంలో దర్శకుడు కె.విశ్వనాథ్ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి పాటలు రాశారు. అక్కడి నుంచి ఆయనకు వెనుతిరిగి చూసే అవసరమే రాలేదు. తెలుగు సినిమాలకు 3వేలకు పైగా అద్భుతమైన పాటలు అందించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు రివార్డులు. రాసిన తొలిగీతం విధాతతలపున కే నంది అవార్డు వచ్చింది. నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,పదమూడు నందులు ఆయన కీర్తికిరీటంలో చేరాయి. పలు సినిమాల్లో సిరివెన్నెల నటించారు కూడా. సాహిత్యరంగానికి ఆయన చేసిన సేవలకుగానూ 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భారతప్రధాని మోదీ సైతం సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.