పంజాబ్ కాంగ్రెస్ కు మరో షాక్. ఇటీవలే రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరవచ్చనే వార్తల నడుమ ఆ రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలనుంచి తప్పుకున్నారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ విషయంలో రాజీపడబోనంటూ… రాజీనామా లేఖను హైకమాండ్ కు పంపారు. అయితే కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీకి ప్రయాణం కావడం, బీజేపీ పెద్దలను కలుస్తారనే ప్రచారం జరగడంతో పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి.
అటు కెప్టెన్ కనుక రాదలుచుకుంటే స్వాగతిస్తామని రాష్ట్ర బీజేపీ నాయకులు అనడంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. ఈనెల 18న కీలకమైన సీఎల్పీ సమావేశానికి కొద్ది గంటల ముందు ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ రాజీనామా చేశారు. పార్టీని వీడుతూ పెద్దలపైనా, సిద్దూపైనా తీవ్ర వ్యాఖ్యలే చేశారు అమరీందర్ సింగ్.