బీజేపీనేత తజీందర్ బగ్గా అరెస్ట్ కలకలం రేపుతోంది. అయితే చిత్రంగా బగ్గా అరెస్ట్ విషయంలో బీజేపీకి మద్దతుగా స్పందించాడు పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. బగ్గా అరెస్ట్ పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యనేనని సిద్దూ వ్యాఖ్యానించారు. బగ్గా మా పార్టీకి కాకపోవచ్చు.. మాకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. కానీ వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి పంజాబ్ పోలీసులను ఆప్ చీఫ్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉపయోగించుకోవడం దారుణమన్నారాయన. ఈ విషయాన్ని రాజకీయం చేయడం ద్వారా పంజాబ్ పోలీసుల ప్రతిష్టను దిగజార్చారని ట్విట్టర్ వేదిగ్గా మండిపడ్డారు.
మొహిలిలో గత నెలలో నమోదైన ఓ కేసుకు సంబంధించిన తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఢిల్లీలోని ఆయన నివాసంలో పంజాబ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకావాలని ఐదు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన హాజరుకాకపోవడంతోనే అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.