పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా హత్య కేసులో హంతకులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. అమృత్సర్లోని అత్తారి సమీపంలో పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న చిచా భక్నా గ్రామంలో నిందితులకు, పంజాబ్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సిద్ధూ హత్యకు పాల్పడిన గ్యాంగ్స్టర్లు భక్నా గ్రామంలో దాక్కున్నట్లు పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. గ్యాంగ్స్టర్ జగ్రూప్ సింగ్ రూపా, అతని భాగస్వామి మన్ప్రీత్ సింగ్ అక్కడే దాక్కున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు, ఆ సమయంలో రెండు వైపుల నుంచి కాల్పులు జరిగాయి. కాల్పుల్లో జగ్రూప్ సింగ్ రూపా మొదట మరణించగా, మన్ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా సాయంత్రం 4 గంటల వరకు కాల్పులు కొనసాగించాడు. కాల్పులు నాలుగు గంటలకు పైగా కొనసాగాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు, ఒక న్యూస్ ఛానెల్ కెమెరాపర్సన్ కుడి కాలికి బుల్లెట్ గాయమైంది. ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో అనేక ఇళ్లను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎన్కౌంటర్ అనంతరం అక్కడ ఒక AK-47 రైఫిల్.. పిస్టల్.. అలాగే పెద్ద సంఖ్యలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని పంజాబ్ యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న ADGP ప్రమోద్ బాన్ ఘటనా స్థలం వద్ద అన్నారు.