ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వైసిపి పార్టీని చావు దెబ్బ కొట్టేందుకు తెలుగుదేశం చక చక పావులు కదుపుతోంది. వైసిపి కేడర్ ని ఖాళీ చేయించినట్లయితే రానున్న కాలంలో పార్టీ పూర్తిగా నేలమట్టం అవుతుందని పసుపు నాయకులు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల నాయకుల్ని తెలుగుదేశం లో చేర్చుకునేందుకు వీలుగా టిడిపి పావులు కదుపుతోంది.
తాజాగా వైయస్ జగన్ కి కుడి భుజంగా నిలుస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి తెలుగుదేశం భారీ షాక్ ఇచ్చింది. ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పటిదాకా తనకు ఎదురులేదని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. కానీ అక్కడే తెలుగుదేశం పార్టీ కీలకంగా చిచ్చు పెట్టింది. పెద్దిరెడ్డి సొంత ఇలాకా పుంగనూరులోని మొత్తం మున్సిపాలిటీ పాలకమండల్ని తెలుగుదేశంలోకి లాగేసుకుంది. దీంతో ఒకేసారి పెద్దిరెడ్డికి వైయస్ జగన్ కి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.
వైయస్ జగన్ తో పాటు పెద్దిరెడ్డి కూడా టిడిపికి టార్గెట్ లిస్టులో ఉన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నడుమ దశాబ్దాల నాటి రాజకీయ వైషమ్యాలు గత అయిదేళ్ల మధ్య కాలంలో పరాకాష్ట కు చేరింది. కుప్పం లో వరుసగా ఏడుసార్లు గెలుస్తూ వచ్చిన చంద్రబాబు ను ఈసారి ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సర్వ శక్తులను వినియోగించారు. కానీ ఉపయోగం లేకపోయింది. చిత్తూరు జిల్లాలో టిడిపికి 11 స్థానాలు లభించాయి. ఈ గెలుపు ధీమాతో టిడిపి ఏకంగా పెద్దిరెడ్డి సొంత ఇంట్లో కుంపటి రాజేసింది.
రెండేళ్ల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హయాంలో ఏకపక్షంగా జరిగిన ఎన్నికలలో వైసీపీ గెలిచిన స్థానిక సంస్థల పై దృష్టి సారించింది. గతంలో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు కూడా వేయడానికి వీలులేని వాతావరణంలో వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న మున్సిపాలిటీలు, మండలాలలో ఆకర్ష్ పధకం అమలు మొదలైంది. ఈ క్రమంలోనే పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ చల్లా బాబు నేతృత్వం లో తెలుగుదేశం పార్టీ లో చేరనున్నట్టు పుంగనూరు మునిసిపల్ చైర్మన్ హలీం బాషా ప్రకటించారు. తనతో పాటు 11 మంది కౌన్సిలర్లు కూడా చేరుతారని చెప్పారు. ఈ సందర్బంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో తమకు పదవులు వచ్చినా అధికారాలు మాత్రం తమ చేతుల్లో లేనందున ప్రజలకు ఏమీ చేయలేక పోయామని, అందుకే తెలుగుదేశం పార్టీ లో త్వరలో చేరనున్నట్టు ప్రకటించారు.
దీంతో 20 వార్డులున్న పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ కోల్పోవడం ఖాయమవుతోంది.
ఒక విధంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కేంద్ర స్థానం ఆనదగిన పుంగనూరు మున్సిపాలిటీ త్వరలో తెలుగుదేశం పార్టీ పరం కావడం లాంఛనమే అని స్పష్టం అవుతోంది. అసలే ఓటమి భారంతో కునారిల్లుతున్న వైసీపీ కి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్మించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కోటలు బీటలు వారడం ఆయన ఇలాకాలోనే మొదలైందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు అంటున్నారు.
రానున్న కాలంలో పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ను నయానో, భయానో లాగేసు కావాలని తెలుగుదేశం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో పెద్దిరెడ్డి వర్గంలో గుబులు మొదలయింది.