దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతోంది. కానీ చాలా కాలం పాటు విదేశీ పాలకులతో పోరాటం చేసిన అసలైన దేశభక్తులకు పెద్దగా గుర్తింపు రాలేదు. రెండు మూడు కుటుంబాల పెద్దలే దేశానికి దిక్కు అన్నట్లుగా చరిత్రను రుద్దేశారు. ఇప్పుడిప్పుడే చరిత్ర పుస్తకాలకు ఆ బానిస సంకెళ్లు వదులుతున్నాయి.
మహమ్మదీయ పాలకులతో అలుపెరుగని పోరాటం చేసిన అద్భుత దేశభక్తుడు ఛత్రపతి శివాజీ. ఆ మహనీయుని స్ఫూర్తిని ఎల్లెడలా చాటేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సమిష్టిగా ఈ కృషిలో పాలుపంచుకుంటోంది. ఈ రెండు ప్రభుత్వాల సమిష్టి కృషి తో ఛత్రపతి శివాజీకి మరో గుర్తింపు లభించింది. మహారాష్ట్ర సర్కార్ శివాజీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. శివాజీ కాలం నాటి 12 కోటలను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చినట్లు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ప్రకటించారు. ఈ మేరకు తాము ప్రతిపాదనలు కూడా పంపామన్నారు. ఆ కోటలు కేవలం వాస్తుశిల్పాలు మాత్రమే కావని, అవన్నీ చారిత్రక వారసత్వ సంపద అని తెలిపారు. ఈ వారసత్వాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం తప్పకుండా అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ వారసత్వ సంపద జాబితాలో సల్హేర్, శివనేరి, లోప్ఘర్, రాయగఢ్, సువర్ణదుర్గ, పన్హాలా, విజయదుర్గ్, సింధు దుర్గ్, ఖండేరి, రాజగఢ్, ప్రతాప్గఢ్ వంటి 11 కోటలు మరియు తమిళనాడులోని జింగీ వంటి కోటలు కూడా వున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి షిండే ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. శివాజీ మహరాజ్ జ్ఞాపకాలు ఇప్పటికీ అందరి మదిలో పదిలంగానే వున్నాయని సీఎం పేర్కొన్నారు.
తెలుగునాట శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం పేరుతో ఒక విజ్ఞాన కేంద్రం నడుస్తోంది. సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లోని దేశభక్తులు దీని ఏర్పాటు చేసుకున్నారు. అదే మాదిరిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.