శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 11న జరిగిన పార్టీ సమావేశంలో మెజారిటీ ఎంపీలు ముర్మువైపే మొగ్గారు. అయితే పార్టీ పరంగా అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాకున్నా…రెండ్రోజుల్లో తమ నిర్ణయం చెబుతామని పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు.
అయితే ముర్ముకు మద్దతుగా ఉండడం అంటే శివసేన భారతీయ జనతాపార్టీతో తిరిగి కలిసినట్టు కాదని రౌత్ అన్నారు. సమావేశంలో ఎన్డీఏ అభ్యర్థిగా మాత్రమే ముర్ముగురించి చర్చించామన్నారు.
ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పట్ల తమకు మంచి అభిప్రాయమే ఉందన్న రౌత్… గతంలో ఎన్డీఏ అభ్యర్థిని కాదని..కాంగ్రెస్ నిలబెట్టిన ప్రతిభాపాటిల్ కు మద్దతిచ్చామని గుర్తుచేశారు. ప్రణబ్ ముఖర్జీకీ తాము మద్దతిచ్చామని..శివసేన ఎవరి ఒత్తిడితోనో నిర్ణయాలు తీసుకోబోదని అన్నారు.
ఇక పార్టీలో చీలికలను నివారించేందుకు ముర్ముకు మద్దతిస్తున్నారనే చర్చా జరుగుతోంది. అయితే మాతోశ్రీలో జరిగిన కీలక సమావేశంలో ఎమ్మెల్యేలు,ఎంపీలు సహా పార్టీ ఇతర నాయకులూ ముర్ముకు మద్దతివ్వాలని అభిప్రాయం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
గత వారం, ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని శివసేన ఎంపీ రాహుల్ షెవాలే ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. “ద్రౌపది ముర్ము ఆదివాసీ కమ్యూనిటీ నుండి వచ్చింది మరియు సామాజిక జీవితానికి మూలాధారమైన సహకారం ఉంది,” అని షెవాలే అన్నారు, తదనుగుణంగా పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయాలనీ కోరారు. అయితే ఠాక్రే ఆయన సన్నిహితులు ముర్ముకు మద్దతిచ్చేందుకు సుముఖంగా లేరని తెలిసింది. కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక ఉంది. రెండు రోజుల్లో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.