మహారాష్ట్రలోని నూతనంగా ఏర్పడిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు జరిగిన విశ్వాస పరీక్షలో 164-99 తేడాతో గెలిచి తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకుంది. షిండేకు అనుకూలంగా 164 ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఏర్పాటైన బీజేపీ-షిండే కూటమికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన మరుసటి రోజే విశ్వాస పరీక్ష జరిగింది. నిన్న నార్వేకర్ శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను తిరిగి నియమించారు. చిఫ్విప్గా భరత్ గొగవాలేను నియమించారు. నిన్న ప్రారంభమైన రెండు రోజుల ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఈరోజు బలపరీక్ష జరిగింది. ముగ్గురు సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
‘‘షిండే ప్రభుత్వానికి భారీ మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. షిండే నమ్మకమైన శివసైనికుడు. అతను బాలాసాహెబ్ సిద్ధాంతానికి విధేయుడు’’ అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు.
31 నెలల మహా వికాస్ అఘాడి ప్రభుత్వ పతనానికి దారితీసిన శివసేనపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏకనాథ్ షిండే జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.