మహారాష్ట్రలో కొత్తగా కొలువైన షిండే సర్కారు ఆరునెలల్లో కూలిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. 2024 ఎన్నికల్లో దేశప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనీ ఆమె అన్నారు. ఇండియాటుడే కాన్ క్లేవ్ ఈస్ట్-2022 లో పాల్గొన్న మమతా పలు సమకాలీన, రాజకీయాంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగానే మహారాష్ట్ర తాజా పరిణామాలపైనా మాట్లాడుతూ అక్కడ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది అనైతిక, అప్రజాస్వామిక ప్రభుత్వమన్ని దీదీ…షిండే, ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చు కానీ..ప్రజల హృదయాల్ని గెలువలేరన్నారు. ఏక్ నాథ్ సీఎంగా ప్రమాణం చేసిన రోజే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తన పార్టీలో కుటుంబ వారసత్వంపై అడిగిన ప్రశ్నలకూ ఆమె సమాధానం ఇచ్చారు. అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో ఉంటే తప్పేంటని ..రెండుసార్లు ఎన్నికల్లో గెలిచాడని…దేశంలో యువనాయకత్వం ఉండడం ఇష్టంలేదా అని ఎదురు ప్రశ్నించారు. అమిత్ షా తన కుమారుడు జైషాకు బీసీసీఐ పదవి కట్టబెట్టలేదా అని విమర్శించారు. కాన్ క్లేవ్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని మమతా ట్వీట్ చేశారు.