కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకోసం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు 17న పోలింగ్ జరుగనుండగా.. అక్టోబరు 19న కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. సెప్టెంబరు 24 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబరు 30 నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. ముప్పై ఏళ్లల్లో కాంగ్రెస్ చీఫ్ పదవికి రెండుసార్లే ఎన్నికలు జరగడం విశేషం. 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్, సీతారాం కేసరి పోటీ పడ్డారు. సీతారాం కేసరి విజయం సాధించారు. 2000లో సోనియా,జితేంద్రప్రసాద పోటీ పడగా… సోనియా గాంధీకి 7,448 ఓట్లు రాగా.. జితేంద్ర ప్రసాద్ కు 94 వచ్చాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అపజయానికి బాధ్యతవహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటినుంచి సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
అయితే మళ్లీ రాహులే తన అధినేత అని పార్టీ సీనియర్లు అంటున్నా పగ్గాలు చేపట్టేందుకు ఆయన సిద్దంగాలేరని తెలుస్తోంది. గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ పేరు వినిపిస్తోంది. మరో సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పేరు వినిపించినా ఆయనసైతం పోటీకి విముఖత చూపినట్టు సమాచారం.దీంతో శశిథరూర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇంతవరకు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అధ్యక్షపదవికి పోటీపై ఇంకా ఏం అనుకోలేదన్న శశిథరూర్.. ఎన్నిక స్వేచ్ఛగా జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ మేరకు మలయాళ దినపత్రిక మాతృభూమికి ఆయనో ఆర్టికల్ రాశారు,
“కొత్త అధ్యక్షుడిని ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అవసరం. పోటీకి చాలా మంది అభ్యర్థులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. పార్టీ, దేశం కోసం మీ అభిప్రాయాలను తెలియచేయాలి. ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ” అనిశశిథరూర్ అందులో రాశారు.
ఈసందర్భంగా బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. థెరిసా మే స్థానంలో డజనుకు పైగా మంది పోటీ పడగా బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి దృష్ట్యాంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో అమలు చేయడం ద్వారా పార్టీ వైపునకు ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు అవకాశం ఏర్పడుతుందని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే వర్కింగ్ కమిటీలోని 12 స్థానాలకు కూడా ఎన్నికలను కూడా నిర్వహించాలని ఆ ఆర్టికల్ లో శశిథరూర్ వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత సంస్కరణలను డిమాండ్ చేస్తూ గతేడాది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల బృందంలో శశి థరూర్ కూడా ఒకరు. మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మనీశ్ తివారి, పృథ్వీరాజ్ చౌవాన్ అధ్యక్ష పేర్లు కూడా వినిపిస్తున్నాయి.