వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. షర్మిల కార్లో ఉండగానే అలాగే కారును క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి తరలించారు. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది. వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిళ తీవ్ర విమర్శలు చేశారు. తమ నాయకుడిపట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె యాత్రకు అడుగడుగునా అడ్డుతగిలారు. పాదయాత్ర ఆపేయాలి పోలీసులు కోరినా ఆమె వినలేదు. కోపంతో ఊగిపోయిన టీఆర్ఎస్ శ్రేణులు ఆమె కార్వాన్ పైనా, మరో వాహనంపైనా పెట్రోల్ పోసి నిప్పింటించారు. దీంతో ఆమెను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తరలించారు. అక్కడ జరిగిన తోపులాటలో షర్మిల మొహానికి గాయాలయ్యాయి. నర్సంపేటలో తనపై దాడిని నిరసిస్తూ ఇవాళ..ప్రగతి భవన్ ముట్టడికి కార్లో సొంతంగా డ్రైవింగ్ చేస్తూ బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. వాహనం దిగాలని కోరినా వినలేదు. ఆ సమయంలో వైస్సార్టీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో ఆమె కార్లో ఉండగానే లిఫ్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు.