వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార టీఎంసీతో పాటుగా.. ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. ఓ వైపు బీజేపీ అగ్రనేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. మరోవైపు సీఎం మమతా బెనర్జీ కూడా తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేపడుతూ.. ప్రజల్ని ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన అగ్రనేతలతో పాటు.. పలువురు ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరడంతో.. ఈ సారి దీదీ ఓటమి ఖాయమన్న సంకేతాలు కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఖరగ్పూర్లో నిర్వహించిన ప్రచార సభలో బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ తాను తీసుకున్న పరివర్తన్ నినాదాన్ని కాపీ కొట్టారని.. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు బీజేపీకి మాత్రమే వస్తాయని అన్నారు. మార్పు తీసుకు రావలంటే ఇతరుల ఆలోచనలను కాపీ కొట్టడం కాదని.. మీలో పరివర్తన ఆలోచనలు రావంటూ ఎద్దేవా చేశారు. తాము మరో సారి అధికారంలోకి రాబోతున్నామని.. వచ్చిన వెంటనే.. ఢిల్లీలో బీజేపీని షేక్ చేస్తానంటూ దీదీ వార్నింగ్ ఇచ్చారు.