పొరుగు దేశం బంగ్లాదేశ్ లో తీవ్రంగా హింస చెలరేగుతోంది. అంతర్యుద్ధం తలెత్తడంతో దేశంలోని వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయిపోయాయి. ఇదే సమయంలో భారతీయుల నివాసాలు, హిందూ దేవాలయాలు, వ్యవస్థల మీద కొన్ని శక్తులు దాడులకు దిగుతున్నాయి. బంగ్లాదేశ్ లోని అంతర్యుద్ధ పరిస్థితిని భారత ప్రభుత్వము ఎప్పటికప్పుడు గమనిస్తున్నది. అక్కడ చిక్కుకున్న భారతీయుల క్షేమ సమాచారాల మీద దేశమంతటా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే బంగ్లాదేశ్ పరిస్థితుల మీద వివిధ సామాజిక సంస్థలు స్పందిస్తున్నాయి. బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి మీద విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు అలోక కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో హిందువులు, సిక్కులు, ఇతర మైనారిటీల మతపరమైన స్థలాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయని అలోక్ కుమార్ తెలిపారు. ఒక్క పంచగఢ్ జిల్లాలోనే 22 ఇళ్లు, జెనైదాలో 20 ఇళ్లు, జెస్సోర్లో 22 దుకాణాలు ఛాందసవాదుల లక్ష్యంగా మారాయని, అనేక జిల్లాల్లో శ్మశాన వాటికలు కూడా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. దేవాలయాలు, గురుద్వారాలను కూడా ధ్వంసం చేయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో వారి హింస, భీభత్సానికి గురికాని జిల్లా ఏదీ లేదని చెప్పారు.
బంగ్లాదేశ్లో ఒకప్పుడు 32 శాతంగా ఉన్న హిందువులు ఇప్పుడు 8 శాతం కంటే తక్కువగా ఉన్నారని, వారు కూడా నిరంతర జిహాదీ పీడనకు గురవుతున్నారని అలోక్ కుమార్ గుర్తు చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, మహిళలు, పిల్లలు, వారి విశ్వాసం, విశ్వాసాల కేంద్రాలు, దేవాలయాలు, గురుద్వారాలు వంటి వాటికి కూడా భద్రత లేదని వీహెచ్పీ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడ అణగారిన మైనార్టీల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితిలో, బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత, మానవ హక్కుల పరిరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం ప్రపంచ సమాజం బాధ్యత అని ఆయన చెప్పారు.
ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా భారతీయ భూభాగంలోకి చొరబాటుకు పెద్ద ప్రయత్నం చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందువల్ల, సరిహద్దుల్లో 24×7 పటిష్టమైన నిఘా ఉంచడం, ఎలాంటి చొరబాట్లను అనుమతించకుండా మన భద్రతా బలగాలు అవసరమని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్లో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం, లౌకిక ప్రభుత్వం పునరుద్ధరణ జరగాలని అలోక్ కుమార్ ఆకాంక్షించారు.
బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనార్టీ వర్గాల భద్రతకు ప్రపంచ సమాజం భరోసా ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.