బంగ్లాదేశ్ లో దాదాపు ఏడున్నర కోట్ల విలువైన ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు.
ఖిల్ఖేత్ ప్రాంతానికి చెందిన ఫాతేమా అక్తర్ ఓపి అనే మహిళ ఇంట్లో పెద్దఎత్తున భారత కరెన్సీని స్వాధీనం చేసుకుని ఆమెనూ అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన వివరాలు ఆధారంగా దక్షిణఖాన్ అనే ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ మొత్తాన్ని గుర్తించారు. డెమ్రాలోని సరులియా ప్రాంతానికి చెందిన అబూ తలేబ్ అనే వ్యక్తినీ అరెస్ట్ చేశారు. ఈ నోట్లు పాకిస్తాన్ లో తయారైనట్టు ఢాకా పోలీసులు నిర్ధారించారు. అవి శ్రీలంక నుంచి మార్బుల్ కంటైనర్లో బంగ్లాదేశ్ లోని చటోగ్రామ్ పోర్టుకు చేరాయి.
పాకిస్థాన్కు చెందిన ఇద్దరు సుల్తాన్, షఫీల సాయంతో శ్రీలంక మీదుగా నకిలీ నోట్లను స్మగ్లింగ్ చేశానని అరెస్టయిన నిందితుడు అబూ తలేబ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇద్దరూ అంతర్జాతీయ స్మగ్లర్లని వారి వెనక పెద్ద ముఠా ఉందని చెప్పాడు. ఆ నోట్లను నవంబర్ 23న వారి చేతులమీదుగానే అందుకున్నట్టు చెప్పాడు. ఆ కరెన్సీని తదుపరి భారత్ చేర్చడం వారి లక్ష్యమని ఢాకా పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతోనే తాము రంగంలోకి దిగామని…నిందితులపై కేసు నమోదు చేశామని…దీని వెనక ఉన్న అసలు సూత్రధారులెవరో కనిపెడతామని వారన్నారు.
పోలీసులకు పక్కా సమాచారం అందడంతో అరెస్టయిన ఇద్దరు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, ఖిల్ఖేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది మరియు ఈ బంధంలో మరింత ప్రమేయం ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.