ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద పోలీసు కేసు నమోదు అయింది. జగన్ మీద పగతో రగిలిపోతున్న తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు తరచు వైసిపి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించేవారు. అప్పట్లో ఆయన్ని అరెస్టు చేసి రెండు రోజులు కస్టడీ లో ఉంచారు. అప్పట్లో తనను చిత్రహింసలు పెట్టి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రఘురామ ఈ కేసు పెట్టారు.
ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద ఆయనకు సన్నిహితంగా నడుచుకున్న పోలీసు అధికారుల మీద రఘురామ ఆరోపణలు చేశారు.
ఈ కేసులో జగన్ ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు.
సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు.
FIR Copy 187-fir pdf_0001_240712_114745
రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదయింది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామరాజు తన పిటిషన్ లో ఆరోపించారు. 2021 మే 14 జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.
కస్టడీలో తనను హింసించారని… తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని తెలిపారు. ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. జగన్ ను విమర్శిస్తే చంపుతామని సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు.
మొత్తం మీద రఘురామ కృష్ణంరాజు పెట్టిన కేసుతో ఏపీ రాజకీయాల్లో కలకలం మొదలైంది ముఖ్యంగా పోలీస్ అధికారులు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు లను అరెస్టు చేస్తారు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేసు బల పడినట్లు అయితే జగన్ కు కూడా కష్టాలు తప్పవు అని అంటున్నారు.