వారం రోజులపాటు బుడమేరు వరదలతో విజయవాడ అల్లకల్లోలం అయిపోయింది. నగరంలోని దిగువ ప్రాంతాలు అయిన సింగ్ నగర్ , అజీజ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. కానీ విజయవాడలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం వరద తాకిడి మాత్రం తగలలేదు. దీనికి కారణం ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
విజయవాడ లో పెద్ద స్థాయిలో ఉన్న రైలు కట్టల వల్ల వరద తీవ్రత తగ్గినది. వరద ముంచెత్తినా కొన్ని ప్రాంతాలకు వరద నీరు చేరకుండా ఈ రైల్వే లైన్లు అడ్డుకున్నాయి. విజయవాడ నగరానికి ఎగువున బుడమేరు ప్రవాహం మొదలు అవుతుంది. ఆ తర్వాత బుడమేరు ప్రవహించే ప్రాంతాలలో పెద్ద ఎత్తున రైలు కట్టలు ఉండడం కలిసి వచ్చింది.
సాధారణంగా రైల్వే లైన్లను నిర్మించేటపుడు భూమట్టానికి ఐదున్నర అడుగుల ఎత్తులో నిర్మాణం చేపడతారు. కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం రైల్వే లైన్ల నిర్మాణం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకొంటారు . విజయవాడ మీదుగా వెళ్లే గ్రాండ్ ట్రంక్ మార్గంతో పాటు, విశాఖపట్నం రైల్వే మార్గాలు రెండున్నర నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయ భూములు ఉండటంతో పాటు తరచూ వర్షాలు, వరదలు ముంచెత్తే అవకాశం ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రైల్వే ట్రాక్ ల పటిష్టతకు పెద్దపీట వేశారు. ఎప్పటికప్పుడు ఈ ట్రాక్లను గమనిస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఆ జాగ్రత్తలే ఇప్పుడు విజయవాడను కాపాడాయి.
ఆగస్టు 31వ తేదీ అర్థరాత్రి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన సమయంలో బుడమేరు ప్రవాహం ఒక్కసారిగా నగరంపై విరుచుకుపడకుండా రైల్వే కట్టలు అడ్డుగా నిలిచాయి. ఈ క్రమంలో కొండపల్లి, రాయనపాడు, విజయవాడ నార్త్ క్యాబిన్ మీదుగా హైదరాబాద్ నుంచి విశాఖఫట్న వైపు నిర్మించిన లూప్ లైన్ బుడమేరు ప్రవాహాన్ని అడ్డుకుంది.
కవులూరు-రాయనపాడు-శాంతి నగర్ మధ్య బుడమేరుకు పలు ప్రాంతాల్లో గండ్లు పడటంతో వరద నీరు వేగంగా విజయవాడను ముంచెత్తింది. బుడమేరు కట్టలు తెగి ఉధృతంగా వరద… నగరం వైపు ప్రయాణించింది. ఆ సమయంలో సగం నగరాన్ని కాపాడుతూ రైల్వే లైన్లు వరద తాకిడిని ఆపగలిగాయి.
అలాగే ఇతర ప్రాంతాలకు కూడా రక్షణ ఏర్పడింది.
బుడమేరు ఉధృతికి .. మెయిన్ రైల్వే స్టేషన్కు కిలోమీటర్ దూరంలో ఉన్న నైజాం గేటు వరకు పట్టాలపైకి నీరు చేరింది. విజయవాడకు ఎగువున ఉన్న కొండ పల్లి రైల్వే స్టేషన్ మాత్రం చాలా ఎత్తులో ఉంటుంది. దాని తర్వాత ఉండే రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా ఎత్తులో ఉంటుుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు రక్షణ దొరికింది.
బుడమేరు నుంచి వచ్చే ముంపును దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. కొంత కాలం క్రితం హైదరాబాద్-విశాఖపట్నం మార్గంలో నిర్మించిన లూప్లైన్ అదనపు భద్రతనిచ్చింది. అలాగే ఎక్కువ ప్రాంతంలో గూడ్స్ రైళ్ల రాకపోకల కోసం నిర్మించిన రైలు కట్టలు కూడా ఇప్పుడు వరప్రసాదం అయ్యాయి.
మొత్తం మీద రైలు కట్టలు విజయవాడలో వరద నష్టాన్ని చాలా వరకు ఆపగలిగాయి. అంత చేతనే స్థానిక ప్రజలు థాంక్స్ మోదీజీ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.