సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకాండకు సంబంధించి రైల్వే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ విధ్వంసకాండ వెనుక కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.
అభ్యర్థులను నర్సరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి రెచ్చగొట్టినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీకి సుబ్బారావు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సొంతూరు ఖమ్మంలో సుబ్బారావు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సుబ్బారావును నరసరావుపేటకు తరలించారు. విద్యార్థులకు వాటర్ బాటిల్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.
అల్లర్ల ఘటనలో మొత్తం 22 మందిని అరెస్ట్ చేశారు. గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్ అభ్యర్థులు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రైలులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు.