కేంద్రప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ అప్లికేషన్
ముద్ర, స్టాండప్ ఇండియా, MSME లోన్ కు ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు!
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి, వివిధ వృత్తుల్లో నిపుణులైన వారిని ప్రోత్సహించడం కోసం అనేక పథకాలు ఉన్నాయి. దీనిని ఐదులక్షల రూపాయల వరకు అయితే ముద్ర లోన్, పదిలక్షల నుంచి కోటిరూపాయలవరకు అయితే స్టాండప్ ఇండియా, కోటి రూపాయల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు అయితే… MSME లుగా విభజించి ఉద్యమిమిత్ర అనే వెబ్ సైట్ ప్రారంభించారు.
ప్రభుత్వం ఇస్తున్న లోన్ అనగానే బ్యాంకు అధికారులు సరైన సమాచారం, సమాధానం ఇవ్వకపోవడం, దరఖాస్తు తీసుకోకపోవడం చాలామందికి అనుభవం. అందుకే ఉద్యమిమిత్ర వెబ్ సైట్ ద్వారా కూడా ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఆధార్, పాన్ , మొబైల్ లాంటి ప్రాథమిక KYC డాక్యుమెంట్లతోపాటు DPR కూడా ఉండాలి.
అంటే మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు? దాని గురించి మీ ప్రణాళికలు ఏంటి? మీ అనుభవం ఎంత అనేది మీరు ఆన్లైన్ లో సబ్ మిట్ చేయడంతోపాటు తరువాత దశలో బ్యాంకు అధికారులకు ప్రాజెక్టు రిపోర్ట్ చూడకుండా టకటకా చెప్పి నమ్మకం కలిగేలా వివరించగలగాలి. అంతేకానీ కరోనా వలన నష్టపోయామండీ. మీరు లోన్ ఇస్తే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాం అనే మాటలు చెల్లకపోవచ్చు. మీరు నిజంగా వ్యాపారం కోసం లోన్ తీసుకుంటున్నారా? లేక లోన్ కోసం వ్యాపారం అంటున్నారా అనే స్పష్టత మీలో ఉందా లేదా అనేది బ్యాంకు అధికారులు పరిశీలిస్తారు.
ఈ ఆన్లైన్ విధానంలో కొత్త వారికంటే ఇప్పటికే ఏదో ఒక వ్యాపారం నిర్వహిస్తూ కరెంట్ ఎకౌంట్, తగిన అడ్రస్ ప్రూఫ్ లు, మంచి ట్రాన్సాక్షన్ మరియు క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి లోన్ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు మీకు వీలైతే స్థానికంగా పరపతి కలిగిన వారి రికమెండేషన్ లేదా ష్యూరిటీ ద్వారా తరువాత దశలో ప్రభావం చూపవచ్చు. ఈ మూడింటిని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI పర్యవేక్షణలో ఉంచారు.
ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.. https://www.udyamimitra.in