ఆర్ఎస్ఎస్ కార్యకర్తను నరికి చంపిన ఎస్డీపీఐ.. మరో 6 మందికి తీవ్రగాయాలు.. పూర్తి వివరాలు ఇవిగో
https://twitter.com/friendsofrss/status/1364967384499560452
కేరళలో పీఎఫ్ఐ,ఎస్డీపీఐ మళ్లీ రెచ్చిపోతుంది. హిందూ సంఘాల నేతలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. అంతేకాదు.. అవకాశం వస్తే చాలు హత్యలు కూడా చేస్తుంది. తాజాగా మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఎస్డీపీఐ గుండాలు అతి కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన అలప్పుజ జిల్లాలోని వయలార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం నాడు సాయంత్రం వయలార్ ప్రాంతంలో ఎస్డీపీఐ ఓ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థల కార్యకర్తలను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో నందు అలియాస్ నందు కృష్ణ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను దారుణంగా హతమార్చారు. నందు వయస్సు 22 సంవత్సరాలు. స్థానికంగా నాగంకులంగరలో శాఖ ముఖ్యశిక్షక్గా పనిచేస్తున్నాడు. నందుని దారుణంగా హతమార్చిన ఎస్డీపీఐ గుండాలు మరో ఆరుగురిపై కూడా దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అళప్పుజ, ఎర్నాకుళంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి 8 మంది ఎస్డీపీఐ సభ్యులను అరెస్ట్ చేశారు. ఘటనాస్థలికి పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్,బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యను నిరసిస్తూ.. బీజేపీ,ఆర్ఎస్ఎస్ గురువారం నాడు జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టింది.
ఎస్డీపీఐ రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండించిన ఆర్ఎస్ఎస్
నాగంకులంగరలో ఎస్డీపీఐ చేపట్టిన ర్యాలీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. దీనిని ఆర్ఎస్ఎస్ ఖండించింది. చెర్తాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్డీపీఐ సంస్థ ర్యాలీని చేపట్టిందని.. ఈ క్రమంలో వారు కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆర్ఎస్ఎస్,బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. అనంతరం ఆర్ఎస్ఎస్,బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారని.. ఈ క్రమంలోనే ఎస్డీపీఐ సభ్యులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 8 మంది ఎస్డీపీఐ సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, స్థానికంగా ఎస్డీపీఐ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య గత కొద్దిరోజులుగా ఘర్షణ చెలరేగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా కాసర్ఘడ్లో యూపీ సీఎం యోగీ ర్యాలీ చేపట్టిన సమయంలో ఎస్డీపీఐ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. అప్పటి నుంచి బీజేపీ,ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులు కూడా పెరిగాయని ఆ సంస్థ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
గతంలో SDPI,PFIపై వచ్చిన ఆరోపణలు
గతకొద్ది రోజులుగా ఎస్డీపీఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సమస్యాత్మంగా మారింది. ఎస్డీపీఐ అనేది పీఎఫ్ఐలో భాగమే. పలు రాజకీయ హత్యలతో పాటు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యల్లో పాల్గొన్నట్లు ఎస్డీపీఐ,పీఎఫ్ఐ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. 2006లో ప్రారంభమైన పీఎఫ్ఐ.. అనేక ఘర్షణల్లో,రాజకీయ హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ (NIA)తో పాటు పలు దర్యాప్తు సంస్థలు పీఎఫ్ఐ పేరును పలు కేసుల్లో చేర్చాయి. అంతేకాదు.. ఇస్లామిక్ స్టేట్ తొలి మాడ్యూల్ను పట్టుకున్నప్పుడు ఎన్ఐఏ పలువురు పీఎఫ్ఐ సభ్యులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. 2020 ఆగస్టులో బెంగళూరులో చెలరేగిన ఘర్షణలో ఎస్డీపీఐ పాత్ర ఉన్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.