ఎస్సీ, ఎస్టీలు మతం మారితే రిజర్వేషన్లకు అనర్హులేనట.. స్పష్టం చేసిన కేంద్రం
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారు హిందూ మతం నుంచి ఇతర మతాలకు (ఇస్లాం, క్రైస్తవం) మారితే వారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలితాలు కోల్పోతారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు.. రవి శంకర్ ప్రసాద్ పై విధంగా సమాధానమిచ్చారు. ఎస్సీ,ఎస్టీల జాబితాలోని అనేకమంది మతం మారినప్పటికీ.. రిజర్వ్డ్ స్థానాల నుంచి ఎమ్మెల్యేలు,ఎంపీలుగా పోటీ చేసి.. పదవులను అనుభవిస్తున్నారని.. అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సమరణ చేసే ఆలోచణ ఏమైనా ఉందా..? అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. జీవీఎల్ ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అయితే ఎన్నికల నామినేషన్ల సమయంలోనే సదరు అభ్యర్ధులు మతం మారినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తగిన సాక్ష్యాధారాలతో చూపిస్తే.. వారి నామినేషన్లను తిరస్కరించవచ్చని మంత్రి తెలిపారు.