అక్షరాస్యతలో నెంబర్ వన్ అని చెప్పుకునే కేరళలో బడిపిల్లలు మత్తుపదార్థాలకు బానిసలవుతున్న ఘటన ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ పెడలర్స్ రెచ్చపోతున్నారు. స్కూళ్లు, ట్యూషన్ సెంటర్లలో డ్రగ్స్ విక్రయం అక్కడ జోరుగా సాగుతోంది. అందులో ఆడపిల్లలే పెద్దసంఖ్యలో ఉండడం కలవరపెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ లాడ్దిలో పోలీసుల రైడింగ్, మత్తులో ఉన్న యువతి నానా హంగామా చేసిన వీడియోలు సోషల్మీడియాలో హల్ చేశాయి. చదువుతో పాటు అన్నింటా చురుగ్గా ఉండే ఆ యువతిని డ్రగ్ మాఫియా మాదకద్రవ్యాలకు బానిసను చేసిందని విచారణలో తేలింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్తు పదార్థాలకు బానిసైన 21 ఏళ్లలోపు వాళ్లలో 40 శాతం 18 ఏళ్లలోపు వాళ్లే ఉన్నారు. అందులోనూ అమ్మాయిలే ఎక్కువ. గతంలో ఎక్కువగా కాలేజీ విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ బాధితులుగా ఉండేవారు, కానీ కొంతకాలంగా స్కూల్ పిల్లలే ఉంటున్నారు.
కొందరు మహిళా పెడలర్ల్.. పాఠశాలల సమీపంలో ఉండే చిన్న చిన్న తినుబండారాల దుకాణదారులతో విద్యార్థులకు డ్రగ్స్ అమ్మిస్తున్నారు. ట్యుటోరియల్స్ పైనా మాఫియా కన్నేసింది. ఇటీవలే పాఠశాలల సమీపాన ఉండే చిన్న చిన్న తినుబండారాల దుకాణాల్లో 18 వేల రైడ్లు చేసి 401 కేసులు నమోదు చేసిన పోలీసులు 462 మందిని అరెస్ట్ చేశారు. పెద్దఎత్తున మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. పాఠశాలలను సందర్శించినప్పుడు బ్యాగులు, బెంచిల్లో డ్రగ్స్ పాకెట్లు చూసి పోలీసులే అవాక్కయ్యారు. మత్తుపదార్థాలకు బానిసలైన వాళ్లు లైంగికదోపిడీకీ గురవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
గతంలో పంజాబ్ లో మాదకద్రవ్యాల బారిన పడిన యువత కథాంశంగా ఉడ్తాపంజాబ్ సినిమా తెరకెక్కింది. తెలంగాణలో కూడా డ్రగ్స్ కేసులు కలకలం రేపాయి. హైదరాబాద్ లో కూడా స్కూల్ పిల్లలే లక్ష్యంగా చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న విషయాలూ వెలుగుచూశాయి. ఇప్పుడు కేరళలో పాఠశాల విద్యార్థుల్నే మాఫియా లక్ష్యంగా చేసుకుంది.