తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. కరీంనగర్ , మహబూబ్నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. వీటన్నింటికీ కలిపి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలకానుంది. నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 26 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ స్థానాలన్నింటికీ డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14న ఫలితాలు విడుదలవుతాయి.
ఇక ఏపీ శాసన మండలిలో 11 మంది సభ్యుల కాల పరిమితి ముగిసింది. వాటిని భర్తీకి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల కోటా సభ్యుల కాల పరిమితి ముగిసింది.