బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడటం వెనక కుట్ర కోణం ఉంది అని సర్ కార్యవాహ (జాతీయ ప్రధాన కార్యదర్శి) దత్తాత్రేయ హోసబలే అభిప్రాయపడ్డారు. హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన వివరించారు. బంగ్లాదేశ్లోని హిందూ, ఇతర మతపరమైన మైనారిటీలకు చెందిన మహిళలపై లక్ష్యంగా చేసుకున్న హత్యలు, దోపిడీలు, దహనం, క్రూరమైన నేరాలు, హిందూ మందిరాలపై దాడులు సహించలేనివని హోసబలే స్పష్టం చేశారు.
దీన్ని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెబుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అటువంటి సంఘటనలను తక్షణమే ఆపడానికి కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, బాధితుల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.
ఈ క్లిష్ట సమయంలో హింసకు గురవుతున్న హిందూ, బౌద్ధ మొదలైన వర్గాలకు సంఘీభావంగా నిలవాలని ప్రపంచ సమాజాన్ని,భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలను హోసబాలే అభ్యర్ధించారు.
స్నేహపూర్వక పొరుగు దేశంగా, బంగ్లాదేశ్లో ఈ పరిస్థితిలో భారత్ ప్రభుత్వం సమర్థ పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్లోని హిందువులు, బౌద్ధులు మొదలైన వారి భద్రతకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కోరింది.
ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ఆకస్మికంగా హింస చెలరేగిన సంగతి తెలిసిందే. అల్లర్లను అదుపు చేయలేని పరిస్థితిలో ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశానికి వచ్చి తలదాచుకున్నారు. అల్లర్లలో భాగంగా హిందువుల మీద విస్తారంగా దాడులు జరగడం భారతీయ సమాజాన్ని కలచి వేస్తోంది.