డాక్టర్ హెడ్గేవార్ జీ 1925 లో ఐదుగురు మంది బాలురతో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేడు మహా వటవృక్షమైందని, దేశంలోని వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘం నేడు విస్తరించిందని తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ. వేంకటేశ్వర రెడ్డి అన్నారు. కేవలం పట్టణాలు, నగరాలే కాకుండా వనాసీ ప్రాంతాల్లో కూడా స్వయం సేవకులు వున్నారని, ఇది అత్యంత గొప్ప విషయమని అభివర్ణించారు. ఇలా సంఘం విస్తరించడానికి డాక్టర్జీ, గురూజీ పాత్ర చాలా వుందని, నాడు నాటిన చిన్న విత్తనమే.. నేడు మహా వృక్షమైందని, ఇది చూస్తే వారు చాలా ఆనందం వ్యక్తం చేసేవారన్నారు.
హైదరాబాద్ అన్నోజీగూడలోని శ్రీ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం జరిగింది. సంఘ నిర్మాణ వ్యవస్థలో శిక్షావర్గలు చాలా కీలకము. సంఘ పనిలో నిమగ్నమే శాఖలకు క్రమం తప్పకుండా హాజరయ్యే కార్యకర్తలను శిక్ష వర్గకు ఎంపిక చేస్తారు. దేశం పట్ల ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉండేటట్లుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వివిధ దశలలో జరిగే శిక్ష వర్గాల ద్వారా సంఘ నిర్మాణంలో చక్కటి కార్యకర్తలు తయారవుతారు. వేసవిలో జరిగిన శిక్షావర్గ ముగింపు సందర్భంగా సార్వజనిక ఉత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవానికి జస్టిస్ వేంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘం నేడు తల్లి స్థానంలో వుందని, అందులోంచి రాజకీయ విభాగం, న్యాయ, విద్యార్థి, గ్రామీణ వికాస్, ధర్మ పరిరక్షణ కోసం, హిందూ జాగరణ కోసం… ఇలా రకరకాల సంస్థలు నేడు సమాజంలో హిందూ సంఘటన కార్యం చేస్తున్నాయని అన్నారు. అన్యాయానికి గురైన వారి పక్షాన వుంటూ, వారికి సరైన న్యాయం అందించడానికి ఇవి కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోని 140 దేశాల్లో సంఘ కార్యక్రమాలు విస్తరించాయని, భారత్లో దాదాపు 90 శాతం వరకు సంఘ కార్యకలాపాలు విస్తరించాయని వివరించారు. సమాజంలోని సామాజిక రుగ్మతల విషయంలో పోరాడుతూ.. గొంతు లేని వారికి గొంతుకై స్వయం సేవకులు నిలబడాలని పిలుపునిచ్చారు.
కీలక ప్రసంగం చేసిన సంఘ తెలంగాణ ప్రాంత సహ ప్రచారక్ ప్రభు కుమార్.. కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు. మరో ఏడాది కాలంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయానికి దేశంవ్యాప్తంగా లక్ష గ్రామాల్లో శాఖలు నిర్వహించాలన్నది సంఘ్ లక్ష్యం అని ఆయన అన్నారు. వివిధ క్షేత్రాల్లో జరుగుతున్న పనుల్ని ఆయన వివరించారు శ్రీ సరస్వతీ విద్యాపీఠం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విలువలు గల విద్య అందిస్తుందని ఆయన గుర్తు చేస్తారు. వనవాసి కళ్యాణ పరిషత్ ద్వారా కొండ కోనల్లో సేవలు అందుతున్నాయని ప్రభు కుమార్ అన్నారు. సంఘ్ ఎంచుకున్న పంచ పరివర్తన ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. దేశ వైభవమే సంఘ్ లక్ష్యమని ఆయన ఉదాహరణలతో సహా వివరించారు.
తెలంగాణ ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సంఘ్ పెద్దలు అతిథులు గా విచ్చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలు నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దండ ను ఉపయోగిస్తూ కార్యకర్తలు చక్కటి విన్యాసాలు ప్రదర్శించారు.