అదే ఢిల్లీ: అదే సీన్ మళ్లీ !
భూమి గుండ్రం. చరిత్ర పునరావృతం. ఢిల్లీలో ఒక సీన్ రిపీట్ అవుతున్నట్టుంది. 2014 జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధర్నా చేశారు. పోలీసు అధికారులు తన మాట వినడం లేదని, ఢిల్లీ శివార్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఒక భవనంలో అర్ధరాత్రి దాడి చేయమంటే చేయలేదని ఆయన ఆందోళనకు దిగారు. మంత్రులు, నేతలు వెంట వచ్చారు. రోడ్డుమీదే పడక వేశారు. రిపబ్లిక్ డే పరేడ్ ను అడ్డుకుంటామని శపథం చేశారు. దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. గణతంత దినోతవ్స పరేడ్ ను అడ్డుకుంటాను అన్నారంటే ఆయనకు ఏపాటి దేశ భక్తి ఉందో అర్థమైంది. చివరకు ఆమ్ ఆద్మీ పార్టీలోని కొందరు నాయకులు తెలివిగా వ్యవహరించారు. కొందరు పోలీసులను బదిలీ చేయండని లెఫ్టినెంట్ గవర్నర్ ను బతిమిలాడి ఒప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కారణం చూపి కేజ్రీవాల్ అది తన విజయమే అంటూ ధర్నా విరమించారు.
ఇప్పుడు నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ శివార్లలో ఆందోళన అనే ఒక కార్యక్రమం జరుగుతోంది. భారీగా ఖర్చు పెట్టి ఇన్ని వేల మందికి సకల సౌకర్యాలు కల్పించేది కార్పొరేట్లే అనే ఆరోపణలున్నాయి. అది నిజమో కాదో తెలియదు గానీ రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ తీస్తామంటున్నారు. పైగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ముందస్తుగానే ఎదురు దాడి చేస్తున్నారు. ప్రపంచం ముందు దేశం పరువు తీసే ఇలాంటి చర్యను కొన్ని ప్రతిపక్షాలు సమర్థిస్తున్నాయి. దేశభక్తి అంటే ఏమిటో తెలియని కొందరు విద్వేష పూరిత రాజకీయం చేయడం వల్లే ఈ దౌర్భాగ్యం. సదరు ఆందోళన అనే చట్ట వ్యతిరేక కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చాలా గట్టి మద్దతు ఇస్తున్నారు. రిపబ్లిక్ డే నాడు లక్ష ట్రాక్టర్ల సాక్షిగా భారత్ పరువు తీస్తారో.. లేక బుద్ధి తెచ్చుకుని బాధ్యతగా మసలుకుంటారో చూద్దాం.