70 రోజుల్లో సాగర్ ఉప ఎన్నిక అనివార్యం?
నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక మే నెలలో జరిగే అవకాశం ఉందనే అంచనాలు నిజం కాకపోవచ్చు. మార్చి మొదటివారంలోనే పోలింగ్ కు నగారా ఫిబ్రవరిలో మోగే అవకాశం ఉంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో పాటే సాగర్ లో ఎన్నిక జరపాలని ఇ.సి. భావిస్తున్నట్టు సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. నోముల నర్సింహయ్య మృతితో సాగర్ ఎమ్మెల్యే పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్- మే నెలలో బెంగాల్ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వాటితో పాటు సాగర్ ఉప ఎన్నిక జరుగుతుందని అన్ని రాజకీయ పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయితే మార్చి మొదటి వారంలో ఉప ఎన్నిక జరిగితే కనీసం నెల రోజుల ముందు, అంటే ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు సీరియస్ గా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
నాగార్జున సాగర్ నియోజకవర్గం అంటే కుందూరి జానారెడ్డి జాగీరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు చలకుర్తిగా ఉన్న ఈ నియోజకవర్గం పేరు పునర్విభజన తర్వాత నాగార్జున సాగర్ గా మారింది. దాదాపుగా అన్ని శాఖల మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత జానారెడ్డి 1978లో చలకుర్తి నంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1985లో కూడా టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 1989లో టీడీపీ ఓడిపోతుందని ముందే ఊహించారేమో, కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. మళ్లీ మంత్రి అయ్యారు. అయితే 1994 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా కొనసాగారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. చలకుర్తి నియోజకవర్గం పేరు నాగార్జున సాగర్ గా మారింది. 2009, 2014 ఎన్నికల్లో జానారెడ్డి ఎప్పట్లాగే విజయం సాధించారు. 2914లో ఆయన మాజీ సీపీఎం నేత, టిఆర్ ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 16,780 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం నోముల నర్సింహయ్య ప్రతీకారం తీర్చుకున్నారు. 7,771 ఓట్ల తేడాతో జానారెడ్డి ఓడిపోయారు.
ఇప్పుడు మళ్లీ జానారెడ్డి పోటీ చేసి విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఆయన్ని తమ పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి ప్రయత్నించిందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. జానారెడ్డి లేదా ఆయన కుమారుడిని పోటీకి నిలపాలని కమలనాథులు భావించారని ఊహాగానాలు వచ్చాయి. అటు టిఆర్ ఎస్ కూడా జానారెడ్డికి గాలం వేసిందనే వదంతులు వినిపించాయి. కాంగ్రెస్ అభ్యర్థిని తానే నిర్ణయిస్తానని, విజయం ఖాయమని ఇటీవల జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మరోసారి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. టిఆర్ ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయవచ్చని, లేదా కోటిరెడ్డికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలతో బిజెపి జోరు మీదుంది. సాగర్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నివేదితా రెడ్డి ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అప్పుడే పాదయాత్ర ప్రారంభించారు. అమెకు టికెట్ ఇంకా ఖరారు కాలేదు. మరో బలమైన అభ్యర్థి కోసం ఆన్వేషణ జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టిఆర్ ఎస్ నాయకుడు కోటిరెడ్డికి గులాబీ టికెట్ దక్కక పోతే ఆయన్ని బిజెపి తరఫున పోటీకి నిలబెట్టే అవకాశం ఉందనేది తాజా ప్రచారం. మిడతల దండువలె దుబ్బాకలో బిజెపి క్యాడర్ చేసిన ప్రచారం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సాగర్ లో కూడా అదే జరిగితే, అభ్యర్థి ఎవరైనా గట్టి పోటీ ఇస్తామని, గెలిచే ప్రయత్నం చేస్తామని బిజెపి వర్గాల్లో వినిపిస్తున్న మాట. టిఆర్ ఎస్ కు ఇది చాలా కీలకమైన ఎన్నిక. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ లో పరాజయం తర్వాత సాగర్ లో ఓడిపోతే పరువుపోయి పలుచన అవుతామని అధికార పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. కాబట్టి ముక్కోణపు పోటీ హోరాహోరీగానే జరుగుతుంది.