సారు..కారు.. బేజారు!
ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా టిఆర్ ఎస్ దే గెలుపు అనేది పాత మాట. ఎక్కడ ఎన్నికలు జరిగినా టిఆర్ ఎస్ కు ఓటమి భయం. ఇది తాజా మాట అన్నట్టుంది పరిస్థితి. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లలో బిజెపి చేతిలో చిత్తయిపోయిన తర్వాత గులాబీ శ్రేణులకు ఎన్నికల ఫోబియా ఎక్కువైనట్టుంది. అందుకే నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ నేత జానారెడ్డికి మద్దతిద్దాం అంటూ కొందరు పరోక్షంగా లీకులు ఇస్తున్నారట. అంతర్గంగా చేయించిన సర్వేల్లో జానాకే చాన్స్ అని తేలిందట. అందుకే, తమ అభ్యర్థిని నిలబెట్టి ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
త్వరలోనే నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికల జరిగే అవకాశం ఉంది. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబీకులు, స్థానిక టిఆర్ఎస్ నాయకుల మధ్య టికెట్ కోసం పోటీ ఉంది. నోముల స్థానికుడు కాదు. కాబట్టి ఆయన కుటుంబానికి ఈసారి టికెట్ ఇవ్వద్దనే వాదన కారు పార్టీలో వినవస్తున్నది. బిజెపి ఇప్పుడు జోరు మీదుంది. దూకుడు పెంచింది . టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు పట్టుదలగా పార్టీకి ప్రచారం చేస్తున్నారు. చివరకు ఎవరికి టికెట్ వచ్చినా ఇప్పటి వరకూ వాళ్లు చేసిన ప్రచారం కమలం పువ్వు గుర్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి క్యాడర్ కూడా హుషారుగా ఉంది.
బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ బిజెపి విజయాల కోసం కసిగా పనిచేస్తున్నది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల కోసం కూడా పార్టీని సంజయ్ సంసిద్ధం చేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి ఎన్నికలకు కూడా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. విద్యాధికులైన గ్రాడ్యుయేట్లు ఈసారి మనకు ఓటు వేస్తారా అని గులాబీ నేతల్లో గుబులు కనిపిస్తున్నది. అయితే ఎక్కువ మంది నాగార్జున సాగర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ కూడా బిజెపి గెలిస్తే టిఆర్ ఎ స్ లో కలకలం చెలరేగుతుందని, ఇది తిరుగుబాటుకు దారితీస్తుందేమో అని పరిశీలకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. కొందరు టిఆర్ ఎస్ నాయకులు కూడా జానాకు జై కొడితే పరువు కాపాడుకోవచ్చంటున్నారు. కానీ కెసిఆర్, కెటిఆర్ మాత్రం ఓటమి భయంతో ఎన్నికకు దూరంగా ఉండటానికి ఒప్పుకొనే అవకాశాలు లేవు. గెలుపే లక్ష్యంగా తమ అభ్యర్థిని బరిలోకి దింపడం ఖాయం అని ఎక్కువ మంది నేతల అభిప్రాయం.