భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్. సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ శివన్ పదవీకాలం ఈనెల 14తో ముగియనుంది. దీంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ …డీవోఎస్ కార్యదర్శి సోమనాథ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు ఆయన రెండున్నరేళ్లు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ గా సోమనాధ్ పనిచేశారు. 2018 జనవరి 22 నుంచి విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సోమనాథ్ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు.
కేరళకు చెందిన సోమనాథ్.. కొల్లంలోని టీఎంకే కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు. తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. పీఎస్ఎల్వీ విభాగంలో టీమ్ లీడర్గా పనిచేశారు. రాకెట్ ఇంజినీరింగ్, లాంచింగ్ వెహికిల్స్ డిజైనింగ్ లో నిపుణుడు సోమనాథ్.
2010 నుంచి 14 వరకూ జీఎస్ఎల్పీ మార్క్-3 ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన హయాంలోనే తొలిసారి కేరే ప్రయోగాత్మక మిషన్ను 2018 డిసెంబరు 18 విజయవంతంగా నింగిలోకి పంపారు. తనకు అప్పగించిన ముఖ్యమైన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానని సోమనాథ్ అన్నారు. చాలా దేశాలు తమ డిఫెన్స్ పవర్ లోని మరో కోణాన్ని ప్రదర్శించడానికి అంతరిక్షాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ భారతదేశం తన విజయాలను సామాన్యులకు శాస్త్రీయ ప్రయోజనాలను చేరవేయడానికి ఉపయోగించుకుంటోందని ఆ పనిని కొనసాగించడమే తన లక్ష్యమనీ అన్నారు.