గడిచిన రెండు సంవత్సరాల కాలఖండం లో ప్రపంచం లో చోటు చేసుకున్న మూడు పరిణామాలు భారత్ ను ఆలోచనలో పడేసింది అందులో 1) చైనా హిమాలయాల పై ఆక్రమణకు ప్రయత్నించటం 2) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాత్రికి రాత్రే పలాయనం చిత్తగించటం 3) ఉక్రేన్ పై రష్యా దాడి. ఈ మూడింటికీ సంబంధించిన పరిణామాలలో ఒకటి నేరుగా భారత్ పైనే దాడి, మిగితా రెండు బైటవి ఇవి ఒక రకంగా భారత్ ను అంతర్ముఖం చేశాయా ? ఆ మూడు సందర్భాలు భారత్ ను తన దేశహితం గురించి స్పష్టమైన వైఖరిని నిర్ణయించుకొనేట్లు చేసిందా ? భారత్ పై ప్రపంచ వైఖిరి లో ఏమైనా మార్పులు చోటు చేసుకొన్నాయి ? వివరాల లోకి వెళ్తే ….. ………
1) చైనా అధ్యక్షుడు జి . జిన్పింగ్ హిమాలయాలపై ఉన్న రాజకీయ సమీకరణాలను మార్చి భారత్ భూభాగాలను ఆక్రమణ కు ప్రయత్నం చేసాడు, నియంత్రణ రేఖ వద్ద సుమారు లక్ష మంది సైనికులను మోహరించి బల ప్రదర్శన ద్వారా భారత్ ను బెదిరించాలని ప్రయత్నం చేసాడు భారత్ దాన్నివిజయవంతగ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది దాని తో చైనా అధ్యక్షుడు మొండి గా వ్యవహరించిన కారణంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యం ఆయుధాలతో హిమాలయాలపై మోహరించి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత్ అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని భారత సైన్యాన్ని సశక్త చేసి అప్రమత్తంగాఉంచింది . చైనా, రష్యా, అమెరికా సామ్రాజ్యవాదం ఉన్న దేశాలు. ఒకప్పుడు రష్యాకు కూడా పెద్ద సామ్రాజ్యం ఉండేది అనేక కారణాల వల్ల ఆ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది, ప్రస్తుతం ఉన్న రష్యా అధినేత పుతిన్ ఆ భూభాగాలను మళ్లీ ఏకం చేయాలి అనే లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నాడు, చైనా కూడా ఇప్పటికే కొన్ని దేశాలు ఆక్రమించి భారత్ కు సవాల్ విసురుతున్నది , మరి కొన్ని దేశాలను తన గుప్పిట్లో బంధించడానికి కుట్రలు పన్నుతోంది , అది సాధ్యం కావాలంటే భారత్ బలహీనంగా ఉండాలి దానికోసం భారత్ ను తన సైనిక శక్తితో బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. చైనా హిమాలయాలపై ఆక్రమణకు ప్రయత్నించడాన్ని అనేక దేశాలు ఖండిస్తు భారత్ కు మద్దతు తెలియచేశాయి.
2) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికా ఏ ఉగ్రవాదులతో నైతే దశాబ్దాలుగా పోరాటం చేసిందో ఆ ఉగ్రవాదులతోనే ( తాలిబన్లతో నే) లోపాయికారి ఒప్పందం చేసుకుని 2021 ఆగస్టులో రాత్రికి రాత్రే పలాయనం చిత్తగించింది. ఒకప్పుడ ప్రజాస్వామ్యం గురించి, మహిళల హక్కుల గురించి, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి, మాట్లాడిన అమెరికా, అమెరికా పెంచి పోషిస్తున్న ఉదారవాదులు, న్యాయవాదులు ఇప్పుడు తాలిబన్ల పై తమ వైఖరి మార్చుకుని ఉమ్మడి ప్రయోజనాల కోసం ఆలోచిస్తూ ఆఫ్ఘనిస్తాన్ ను 1990 సంవత్సరం నాటి పరిస్థితుల్లోకి నెట్టివేసింది దాంతో ఉగ్రవాద సమస్య భారత్ కు మరో రూపంలో ఎదురవుతోంది , ఉగ్రవాదులను ఒంటరిగా ఎదుర్కోవలసిన పరిస్థితులు నిర్మాణం అవుతున్నాయి.
3) రష్యా ఉక్రెన్ పై దాడికి దిగటం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉన్నట్లు కనబడుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ను సవాలు చేస్తూ పాశ్చాత్య దేశాలను 20వ శతాబ్దం పరిస్థితుల్లోకి నెట్టి వేయాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది దానికోసం స్వతంత్ర సార్వభౌమ దేశంపై దాడి చేశాడు, దానితో నాటో దేశాల[నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(NATO) ] వ్యూహాలను మార్చాలని నిర్ణయించుకున్నాడు.ఇంకొక ప్రక్క రష్యా, ఐరోపా ఖండం లోని రాజకీయాలను మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. పాశ్చాత్య దేశాలు చైనాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నాయి దాని కారణంగా పాశ్చాత్య దేశాల కొన్ని మిత్ర దేశాలు దూరం జరిగినప్పటికీ పాశ్చాత్య దేశాలు చైనా వైపే మొగ్గు చూపుతున్నాయి, ఐరోపా ఆసియా దేశాల భౌగోళిక రాజకీయ వ్యత్యాసాలు వాళ్ళు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ఉక్రేన్ పై యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో పతాక శీర్షికలో కనబడుతున్నాయి. జాతుల మధ్య భౌగోళిక మార్పుల కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు నైతిక విలువల పతనం ఎట్లా ఉంటుందో మనకు స్పష్టంగా కనబడుతుంది. పాశ్చాత్య దేశాలు తూర్పు దేశాలతో భాగస్వామ్యం కావడంపై విశ్లేషణ చేస్తే కఠినమైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఉక్రెన్ పై దాడి భారత్ ను పెద్ద చిక్కుల్లో పడేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ ఓటింగ్ కు దూరంగా ఉంది, భారత్ తన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నదని భారత ప్రతినిధి స్పష్టంగా ప్రకటించాడు. భారత్ ఆవిధంగా గా వ్యవహ రించ వచ్చు అని ముందే ఊహించబడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాలు గుడ్డిగా చైనా తో అంటకాగే విధానంపై, మరియు మెరికా ఆఫ్ఘనిస్థాన్ నుండి పలాయనం చిత్తగించటం వల్ల ఆఫ్ఘనిస్థాన్లో చోటు చేసుకున్న తీరుపై ఈరోజు ప్రజలలో పెద్ద చర్చే జరుగుతోంది.
స్వావలంబన దిశగా భారత్ :
ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ముందు ఒకే ఒక మార్గం ఉంది అదే స్వావలంబన దిశగా ప్రయాణించటం దీనికి ఇప్పుడు దేశంలో పెద్ద అడ్డంకులు లేవు, ఎందుకంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే … 2003 సంవత్సరంలో ఇరాక్ పై అమెరికా దాడి చేసిన సమయంలో భారత్ లో తీవ్ర రాజకీయ చర్చలు జరిగాయి. ఆ సమయంలో ఇరాక్ లో అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా భారతదేశం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గళం వినిపించింది, కానీ ఇప్పుడు రాజకీయాలు తీవ్రంగా ఉన్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమర్ధిస్తున్నాయి. ఈ సమయంలో భారత్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి, మన దేశం స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ గా వికసించటానికి ప్రయత్నాలు జరగాలి , అట్లాగే దేశ భద్రత విషయం లో ఇతర దేశాలపై ఎంతో ఆధారపడి ఉన్నాం, ఇది ఎప్పుడైనా భారత ప్రయోజనాలకు సవాలుగా మారే అవకాశాలు ఉన్నాయి .ఈ విషయంలో ఏం చేయాలో ఒక స్పష్టత రావలసిన అవసరం ఉంది.అదే స్వావలంబన దిశగా ప్రయాణించటం. ఇక చివరగా అమెరికా మరియు యూరప్ దేశాలు రష్యా పై కఠిన వైఖరి తీసుకోవచ్చు ,ఒకవేళ తీసుకొంటే మరో పక్క దూకుడుగా వ్యవహరిస్తున్న చైనా విషయంలో అమెరికా పాశ్చాత్య దేశాలు కఠినంగా ఉండగలుగుతాయా? అనేది పెద్ద ప్రశ్న. ఈ రోజున భారత దేశం ముందు మూడు ముఖ్యమైన భౌగోళిక రాజకీయ సమస్యలు ఉన్నాయి, 1)రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ పరిస్థితులలో వచ్చిన మార్పులను మనం ఎంత అవగాహన చేస్తున్నాము ఆ సమయంలో నిర్మాణమైన ప్రపంచ వ్యవస్థలలో మార్పులు, వికాసం ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచి మన వ్యవహార శైలి ఎట్లా ఉంది, ఆ వ్యవస్థల లోటుపాట్లను ప్రశ్నించే ధైర్యంఉన్నదా?2)ప్రారంభం లో అమెరికా రష్యా ల మధ్య ఘర్షణ ఉండేది , మధ్యలో , చైనా అమెరికా ల మధ్య ప్రస్తుతం మళ్లీ అమెరికా రష్యాల మధ్య సంఘర్షణకు తెర లేస్తున్నది. 3) ప్రపంచ జనాభాలో6వ వంతు జనాభా ఉన్న భారతదేశం గ్లోబల్ నెట్వర్క్ లో పూర్తి భాగస్వామ్యం అవుతున్నదా ఇతర దేశాలతో అనుసంధానం చేసుకోగలుగుతొందా ఇవన్నీ ప్రశ్నలే, ఇటువంటి సమయంలో భారత ప్రధాని స్వావలంబన కోసం ఇచ్చిన పిలుపు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ దేశాలతో ఆర్థిక వాణిజ్య ఒప్పందాల కోసం సమర్థవంతంగా వ్యవహరించగలగటం దానికోసం అవసరమైతే చట్టాలలో ఉండే లోపాలను సరి చేసుకునే ప్రయత్నం కూడా చేయవలసిన అవసరం ఉంది.
ప్రపంచం లో భారత్ పై చర్చ పరిణామాలు :
రష్యా ఉక్రెన్ పై దాడి విషయంలో భారత్ అనుసరిస్తున్నవైఖిరి పై అనేక చర్చలకు విమర్శలకు దారి తీసింది, కొన్ని దేశాలు భారత్ అనుసరిస్తున్న విధానంపై చాలా ఆసక్తిగా అధ్యయనం చేస్తున్నాయి , మరి కొన్ని దేశాలు ఒకపక్క భారత్ ను విమర్శిస్తూనే మరో ప్రక్క భారత్ తో చర్చించేందుకు సిద్ధపడడుతున్నాయి ఇది ఒక ఆసక్తి కరమైన పరిణామం.. రష్యాతో ఆర్థిక సంబంధాలు భవిష్యత్తులో భారత్ కు అనేక సమస్యలు తెచ్చే అవకాశం ఉన్నదని రష్యా ఎల్లప్పటికీ మీ పక్షాన ఉంటుందనీ, కష్టకాలంలో ఆదుకుంటుందనీ భ్రమపడకండి, అది చివరికి చైనా మాట విని మీ కొంపముంచుతుంది అని అమెరికా డిప్యూటీ జాతీయ భద్రత సలహాదారుడు నర్మగర్భంగా హెచ్చరికలుజారీచేశాడు . అదే సమయంలో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లెవరోవ్ మాట్లాడుతూ” భారత్ కు తాము సాంకేతిక పరిజ్ఞానం అందించటమే కాదు రాయితీ తో కూడిన చమురు కూడా ఇవ్వాలని అనుకుంటున్నట్లు, భారత్ ఏరూపంలోమధ్యవర్తిగా ఉన్నా మాకు ఏమీ ఇబ్బంది లేదు అని కూడా” అన్నడు. ఇట్లా చర్చలు జరుగుతున్నాయి. ఇంకొక ప్రక్క భారత్ రష్యా ఆక్రమణ గురించి భారత్ ఏమీ మాట్లాడలేదా ? గమనిస్తే అట్లా ఏమీ లేదు భారత్ చాలా స్పష్టంగా రష్యా కు ఉక్రేన్ రెండిటికీ కూడా UN చార్టర్ మరియు అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మధ్య జరగబోయే చర్చలలో అనుసంధానం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు భారత్ ప్రకటించింది.నిన్నటి రోజు (6. 4. 2022) పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసిన ప్రకటన” ఊచకోతలు, రక్తపాతం సమస్యకు పరిష్కారం కాదనీ, చర్చలు మాత్రమే హింసకు ముగింపు పలుకుతాయని ”చెప్పారు. బుచా ఊచకోతలను ఖండించడం, తీవ్రమైన అంశంగా వ్యాఖ్యానించి స్వతంత్రదర్యాప్తుకు మద్దతు ప్రకటించడంద్వారా భారతదేశం పాశ్చాత్యదేశాల బుచా ఊచకోతలపై వాదనను సమర్ధించింది . ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలను గౌరవించాలన్న వ్యాఖ్య కూడా రష్యాకు హితవే అనుకోవాలి. యుద్ధం వద్దనీ, అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమనీ రష్యాకు తెలియచేసినట్టు కూడా జయశంకర్ చెబుతున్నారు. యుద్ధంలో ఎవరిపక్షమూ వహించబోమనీ, మాది శాంతిమార్గము అని ప్రకటించాడు. ఒక పక్క ఆసక్తి, మరో ప్రక్క విమర్శలు చేస్తూనే అనేక ప్రముఖమైన దేశాల ప్రతినిధులు భారత్ కు వచ్చి వెళ్తున్న విషయం మనం గమనించాలి. ఐరోపా దేశాల నుండి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి, జర్మనీ జాతీయ భద్రత సలహాదారుడు, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి , అమెరికా డిప్యూటీ NSA ( నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్), రష్యా విదేశాంగ మంత్రి వచ్చి వెళ్లారు. హిమాలయాల్లో ప్రతిష్టంభన తర్వాత అంటే సుమారుగా రెండు సంవత్సరాల కాలఖండం లో చైనా దేశం నుండి ఏ అధికారి భారత్ లో అడుగు పెట్టలేదు, కానీమొన్న ముందుగా ఏ షెడ్యూల్ లేకుండా నే చైనా విదేశాంగ మంత్రి అకస్మాత్తుగా భారత్ కు వచ్చి వెళ్లారు. ఇక్కడే ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి అమెరికా, రష్యా, ఐరోపా దేశాల వాళ్లు ఒకే సమయం లో భారత్ లో ఉన్నారు అది మనలనుఆశ్చర్యపరచింది . ఉక్రేన్ పై రష్యా దాడి కారణంగా అంతర్జాతీయ వేదికల పై నెలకొన్న ఉత్కంఠ పరిస్థితులలో భారత్ పాత్ర ఏమిటి అన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. ఏమి దాచుకోవలసిన అవసరం లేని ప్రశ్న ఒకటి ఉంది భారత రష్యా సంబంధాలు ఇప్పటివి కావు స్వతంత్రం వచ్చినప్పటి నుండి రష్యాతో భారత్ కు పటిష్టమైన సంబంధాలుఉన్నాయి. స్వతంత్రం వచ్చిన సమయంలో అమెరికా చైనా వైపు మొగ్గు చూపింది. భారత్ ను నిర్లక్ష్యం చేసింది. భారత్ కు సంకట పరిస్థితుల్లో ఆయుధాలు అందించేందుకు రష్యా ముందుకొచ్చింది, ఇప్పటికీ ప్రపంచం నుండి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలలో 55% రష్యన్ నుండే ఉంటాయి, భారత్ చైనా విషయంలో అనుసరించవలసిన వ్యూహాలకు కూడా రష్యా తో సంబంధం చాల అవసరం. ప్రస్తుతం భారత్ కొన్ని దశాబ్దాల నుండి పాశ్చాత్య దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూ వస్తున్నది ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న క్యాడ్ కూటమిలో అమెరికా ఐరోపా దేశాలతో పాటు భారత దేశంఉన్నది
ముగింపు :
మారుతున్న ప్రపంచ పరిస్థితులలో భారత్ శక్తివంతంగా వ్యవహరిస్తున్నది భారత దేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, ఒక ప్రక్క పాశ్చాత్య దేశాలు రష్యా తో ఉన్న వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూ మన దేశాన్ని ప్రశ్నించడం పై ఆదేశాలను భారత్ విదేశాంగ శాఖ ప్రశ్నించింది . ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు భారత ఒక సందేశం అందిస్తోంది అదేమిటంటే దౌత్య పరంగా మేము అనుసరిస్తున్న విధానంపై మమ్ములను ప్రభావితం చేయవద్దు అని. దౌత్య పరంగా పరిణతి చెందిన భారత్ వ్యవహరిస్తున్న తీరు రాబోయే రోజులలో అంతర్జాతీయ వేదికలను ప్రభావితం చేయాలి, ఆ దిశలో భారత్ కృతనిశ్చయంతో ముందుకు సాగటం చాలా అవసరం. మరో ప్రక్క భారత్ లో ఉన్న వైవిధ్యాలను వైరుద్యాలుగా చూపిస్తూ అంతర్గతంగా సంఘర్షణలు నిర్మాణం చేయాలని ప్రయత్నిస్తున్న శక్తుల విషయంలో అప్రమత్తం గా ఉంటూ ప్రజలలో దేశ భక్తిని వికసింప చేయాలి.
~ రాంపెల్లి మల్లికార్జున్
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)