ఉక్రెయిన్ పై రెండో రోజూ రష్యా యుద్ధం కొనసాగుతోంది. వెనక్కి తగ్గేది లేదంటూ పుతిన్ చేస్తున్న ముప్పేట దాడికి ఉక్రెయిన్ వణుకుతోంది. ఇక కొద్దిసేపటి క్రితమే రాజధాని కీవ్ లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఉదయం ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో రష్యన్ క్షిపణులు కురిశాయి. సాధారణ పౌరులు తమ లక్ష్యం కాదని పుతిన్ చెప్పినా…జనావాసాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపించింది. స్థానిక అధికారుల సూచనతో ఆయా నగరాల్లోని ప్రజలు సురక్షిత బంకర్లలోకి వెళ్లిపోయారు. రష్యా యుద్ధ ట్యాంకుల్ని నివారించేందుకు ఉక్రెయిన్ సైన్యం కీవ్ లోని వంతెనను పేల్చేసుకుంది.
అటు రష్యా తీరుపై అమెరికా, యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా పుతిన్ తగ్గకుంటే రష్యాతో సంబంధాలు పూర్తిగా తెంచుకునేందుకూ సిద్ధమని బైడెన్ హెచ్చరించారు. అమెరికా మిత్రదేశాల నమ్మకాన్ని ఆయన వమ్ముచేశారని విమర్శించారు. తాము విధించబోయే మరిన్ని కఠినమైన ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందన్న ఆయన….అన్నట్టుగానే రష్యాపై అమెరికా , యూరప్ దేశాల ఆంక్షలు విధించింది. పాశ్చాత్య దేశాలతో రష్యా వ్యాపార సామర్థ్యాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా ఆంక్షలను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా…రష్యాకు చెందిన రెండు అతి పెద్ద బ్యాంకులపై (వీఈబీ, ప్రోమ్స్వాజ్ బ్యాంకులు), రష్యన్ సావరిన్ డెట్పైన, ఆ దేశానికి చెందిన ఉన్నత వర్గాల వారిపైన, వారి కుటుంబ సభ్యులపైన ఆంక్షలు ప్రకటించారు.
భారత్ మాత్రం ఇంకా తటస్థ వైఖరినే అవలంబిస్తోంది. ప్రధాని మోదీ పుతిన్ తో ఫోన్లో మాట్లాడారు. దాడులు ఆపాలని, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంటును స్వాధీనం చేసుకుని కీవ్ వైపు శత్రు బలగాలు దూసుకొస్తున్నాయని ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్సీ చెప్పారు. మరికొన్ని గంటల్లో శత్రు సేనలు కీవ్ ను ముట్టడించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. నాటో దేశాలు, ఇతర యూరప్ దేశాలతో మాట్లాడనని.. ఎవరూ సహకరించడం లేదని వాపోయారు. ఉక్రెయిన్ ఒంటరిగా మిగిలిందని… తనను, తన కుటుంబాన్ని చంపడమే రష్యా లక్ష్యమని ఆరోపించారు. తాను రాజధానిని వీడానన్న వార్తల్ని ఖండించిన జెలెన్ స్కీ దేశ ప్రజలతోనే ఉంటాననీ అన్నారు.
రష్యా దాడుల్లో 137 మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు మరణించారన్న వార్తల నేపథ్యంలో ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాము ధీటుగా పోరాడుతున్నామని దాడుల్లో 450 రష్యాసైనికులు చనిపోయారని… ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది.
క్రమంగా ఉక్రెయిన్ నగరాలను ఆక్రమించుకుంటూ వెళ్తున్న రష్యా రెండు మూడు రోజుల్లో రాజధాని కీవ్ ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఉక్రెయిన్ పూర్తిగా రష్యావశమయ్యేట్టు కనిపిస్తోంది.
ఈ యుద్ధంతో అక్కడున్న భారతీయుల తరలింపుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారిని తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంది. రొమేనియా, హంగరీ మీదుగా భారత ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)