ఉక్రెయిన్ లోని మరియుపోల్ నగరం పూర్తి స్థాయిలో రష్యా పరమైనట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్లో రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా పుతిన్ సేనలు ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అజోవ్స్థల్ స్టీల్ ప్లాంట్ మినహా ఉక్రేనియన్ ఓడరేవు నగరాన్ని రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని గురువారం రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ నుంచి మరియుపోల్కు విముక్తి లభించిందని అన్నారు. మరియుపోల్ను ఆక్రమించడం రష్యా దళాల పోరాటానికి విజయమని పుతిన్ అభివర్ణించారు. అజోవ్స్థల్ స్టీల్ ప్లాంట్ పై దాడి చేయడానికి బదులు.. దానిని ముట్టడించాలని సైన్యానికి పుతిన్ సూచించారు.
అజోవ్స్థల్ స్టీల్ ప్లాంట్ లో దాదాపు 2,000 మంది ఉక్రేనియన్ సైనికులు ఉన్నారని సెర్గీ షోయిగ్ తెలిపారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత అమానవీయ, అనాగరిక సైన్యంగా రష్యా తన పేరును చరిత్రలో రాసుకుంటోందని విమర్శించారు. ఉక్కు కర్మాగారంపైనా, దాదాపు 300 మంది చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రిపైనా రష్యా దాడులు చేసిందని చెప్పారు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు మృతిచెందారని అన్నారు.