మహారాష్ట్ర పరిణామాలపై మరోసారి స్పందించారు నటి కంగనా. “చెడు సమాజాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, విధ్వంసం ఆసన్నమైందని అర్థం. ఆ తరువాత వినూత్న సృష్టి మొదలవుతుంది. జీవిత కమలం వికసిస్తుంది” అంటూ చేసిన వీడియోను సోషల్మీడియాలో షేర్ చేశారు. వీడియోలో ఆమె ప్రజాస్వామ్య పునర్జన్మ గురించి చర్చించింది. 1975 నుంచి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రస్తుత సమయం అత్యంత కీలకమని పేర్కొంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గురించి కంగనా తన రెండేళ్ల క్రితం ప్రకటనను ప్రస్తావించింది.
“2020లో ప్రజాస్వామ్యం ఒక విశ్వాస వ్యవస్థ అని నేను చెప్పాను. అధికారం కోసం దురాశతో ఈ విశ్వాస వ్యవస్థను నాశనం చేసేవారు నాశనమైపోతారు. వారి దురహంకారాన్ని ఎవరో ఒకరు కూల్చివేస్తారు” అని తాను అన్న మాటలను గుర్తు చేసింది.
“హనుమాన్ ని శివుని 12వ అవతారంగా పరిగణిసస్తాం. శివుని పేరును పార్టీ పేరులో భాగస్వామ్యం చేసిన శివసేన స్వయంగా హనుమాన్ చాలీసాను నిషేధించినప్పుడు.. శివుడు కూడా వారిని రక్షించలేడు. హర్ హర్ మహాదేవ్. జై హింద్, జై మహారాష్ట్ర” అని ఆమె అన్నారు.