సీపీఎం ప్రభుత్వం తనను ఏ స్థాయిలో వేధించారో చెబుతూ కేరళ మాజీ ఐపీఎస్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనను కలవడానికి వెళ్లినప్పుడు సీఎం పినరయ్ విజయన్ అనుచిత ప్రవర్తన గురించి న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంటర్వ్యూలో వివరించారు.
ముహమ్మద్ ఫజల్ హత్య కేసు దర్యాప్తులో తన మాట విననందుకు ప్రతీకారంగా…రాధాకృష్ణన్ ను 2006లో కేరళ సర్కారు సస్పెండ్ చేసింది. దళితుడినైన తనను తప్పుడు కేసులో ఇరికించి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. హత్యకేసులో ఆర్ఎస్ఎస్ వ్యక్తులను ఇరికించాలని సీపీఎం నేతలు కోరినట్టు గతంలోనే చెప్పారు రాధాకృష్ణన్.
రాధాకృష్ణన్ కన్నూర్లోని డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో డిప్యూటీ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు, సిపిఎంకు రాజీనామా చేసి ఎన్డిఎఫ్లో చేరిన మహ్మద్ ఫజల్ను అక్టోబర్ 22, 2006న కొందరు దుండగులు హత్య చేశారు. అయితే ఫజల్ హత్య జరిగిన మరునాడు సీపీఎం ఓ సమావేశం ఏర్పాటు చేసిందని…ఆ ఏరియా సెక్రటరీ అయిన రాజన్ తో పాటు మరో నలుగురు కార్యకర్తలే హత్య చేశారని చెప్పడంతోవారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అయితే వారి స్టేట్ మెంట్ లను రికార్డు చేసి తరువాత వాళ్ల కార్యకలాపాలపై నిఘా పెట్టనన్నారు. రెండోరోజు హోంమంత్రి కొడియేరి బాలకృష్ణన్ తనను పయ్యాంబలం గెస్ట్ హౌస్ కు పిలిపించి ఏడు రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయమని ఒత్తిడి తెచ్చారన్నారు. ఆ హత్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రమేయం లేదని నిర్థారణ అయినందున అధికార పార్టీని ఎదిరించి వారిని విడిచిపెట్టానని వివరించారు.
హత్యతో సంబంధం ఉన్న సీపీఎం వ్యక్తులను తరువాత తాను అదుపులోకి తీసుకున్నానని.. ఆరోజే సీపీఎం గుండాలు తనపై దాడి చేశారని వాపోయారు. ఆలోగా కేసు క్రైం బ్రాంచ్ కి బదిలీ అయిందని.. నేరస్తులైన ముగ్గురు సీపీఎం సభ్యుల్ని క్రైం బ్రాంచ్ అరెస్ట్ చేసిందని గుర్తు చేసుకున్నారు. సీబీఐ విచారణ కోరుతూ ఫజల్ భార్య హైకోర్టును ఆశ్రయించగా మరో నలుగురు సీపీఎం నేతలపై హత్యకేసు నమోదు చేస్తూ ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదని తేల్చింది.
తాను దళితుడినైనందునే టార్గెట్ చేశారని..ఇంకా సమాజంలో వివక్ష, అంటరానితనం ఉన్నాయనడానికి తనకు జరిగిన అన్యాయమే నిదర్శనమని వాపోయారు. 2016లో జాయింట్ ఎక్సైజ్ కమిషనర్ హైకోర్టులో తప్పుడు నివేదికను సమర్పించారని ఫిర్యాదు చేయడంతో మళ్లీ సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఆర్డర్కు వ్యతిరేకంగా రాధాకృష్ణన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను, సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. అతని సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని…తిరిగి నియమించాలని ఆదేశాలు వచ్చినా… కేరళ ప్రభుత్వం అమలుచేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడింది. ఆ సమయంలో పలుమార్లు అధికారులు, నాయకులు తనను మానసికంగా వేధించారని ఆయన చెప్పారు.
సీఎం కూడా తనపట్ల కక్షపూరితంగా ప్రవర్తించారే తప్ప ఏనాడూ కనికరించలేదంటూ మూడేళ్లనాటి ఘటన గురించి మీడియా ఎదుట వివరించారు. 2018లో సీఎం విజయన్ను ఒకసారి తన కార్యాలయంలో కలవడానికి రాధాకృష్ణన్ వెళ్లారట. తనకు ఎదురైన కష్టాలను సీఎంకు వివరించి సస్పెన్షన్ రద్దు చేయాలని కోరారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని…నిలిపివేసిన తన జీతం తనకు కావాలని వేడుకున్నారు. లేకుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని ప్రాథేయపడినా విజయన్ కరగలేదట… అంతేకాదు అలాగే చేసుకోమ్మనీ నిర్దయగా చీత్కరించారని ఈ మాజీ ఐపీఎస్ వాపోయారు. సీఎం ఆ మాట అనడంతో వెక్కివెక్కి ఏడుస్తూ బయటకొచ్చి అక్కడే కుప్పకూలానన్నారు.
ప్రస్తుతం రాధాకృష్ణన్ ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అతని కుమార్తె, రీసెర్చ్ స్కాలర్…ఆమె హాస్టల్ ఫీజులను భరించలేని స్థితిలో ఆ కుటుంబం ఉంది. తానిప్పుడు పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న రాధాకృష్ణన్ కుమారుడూ ఆర్థిక స్థోమత లేక మధ్యలోనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కుటుంబ రోజువారీ ఖర్చుల కోసం తమ పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తినీ అమ్మేసుకున్నారు . ఇంటి రుణం చెల్లించలేని స్థితిలో బ్యాంక్ వాళ్లు ఆ ఇంటిని జప్తుచేశారు. తనను ఎప్పటికైనా చంపేస్తానని భయపడుతున్నారు ఈ ఐపీఎస్.