తప్పు చేసిన హింసకు పాల్పడిన శిక్ష తప్పకుండా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్… సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ జి భాగవత్ అభిప్రాయపడ్డారు. అదేపనిగా హింసకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని అది సమాజానికి మంచిది కాదని ఆయన వివరించారు. హిందూ మేనిఫెస్టో అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ.. దేశంలో జరుగుతున్న ముఖ్యమైన అంశాల మీద.. మోహన్ జి స్పష్టమైన వివరణ ఇచ్చారు.
ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని డా. భగవత్ చెప్పారు. మనం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని, అయితే వాళ్లు ఉగ్రదాడులు చేస్తున్నారని, దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెబుతున్నారని అంటూ పాకిస్థాన్ వైఖరిపై మండిపడ్డారు. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయర, ఇది మన స్వభావం కాదని, ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవని స్పష్టం చేశారు.
పొరుగువారిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టమని, కానీ కొందరు చెడుకు పాల్పడితే మార్గం ఏంటీ? అని ప్రశ్నించారు. రాజు విధి ప్రజలను రక్షించడమని పేర్కొంటూ రాజు తన విధిని నిర్వర్తించాలని హితవు చెప్పారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే రాజు తనపని తాను చేసుకుంటూ పోతారని స్పష్టం చేశారు. రాజు ప్రజలను రక్షించేందుకు రాజు తీసుకున్న చర్యలను ప్రజలు గుర్తుంచు కుంటారని చెప్పారు.
అహింస మన స్వభావం, మన విలువ అని, అయితే కొందరు ఏం చేసినా మారరని, వారంతా ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతూనే ఉంటారంటూ పాకిస్తాన్పై పరోక్షంగా మండిపడ్డారు.
ఈ సందర్భంగా రామాయణంను మోహన్ జీ ఉదహరించారు.
రాముడు సైతం రావణాసురుడిని రాజ్య ప్రజల కోసమే చంపారని అంటూ అది హింస కాదని స్పష్టం చేశారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే తప్పని చెప్పి, సరైన మార్గంలో నడిపించడం రాజు బాధ్యత,ఇప్పుడు కూడా రాజు తన పని తాను చేసుకుంటూ పోతాడని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ దూకుడికి సరైన సమాధానం చెప్పాలని దేశమంతా కోరుకుంటున్నది. మోహన్ జీ మాటల్లో కూడా ఇదే స్వరం వినిపించింది.