రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గ్రామ గ్రామానికి, ఇంటింటికీ వెళ్ళాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతోంది. శతాబ్ది సంవత్సరంలో దీనిని ప్రాధాన్యత గా పెట్టుకొన్నారు.
ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల వివరాలు తెలియ చేసేందుకు
తెలంగాణ అధ్యక్షులు సుందర రెడ్డి,
ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు.
ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలకు చేరుకుంటున్న తరుణంలో సంఘ భావజాలం, సంఘ్ సిద్ధాంతాలను సమాజంలోకి మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు, మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న వేళ అఖిల భారత ప్రతినిధి సభలు జరిగాయన్నారు. . దేశవ్యాప్తంగా మొత్తం 51,570 స్థలాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) దైనందిన శాఖలు 83,129 నడుస్తున్నాయి. వీటితో పాటు 32,147 శాఖా మిలన్లు (వీక్లీ), 12,091 నెలవారీ శాఖలు (మండలి) నడుస్తున్నాయి. మొత్తంగా దైనందిన శాఖ + మిలన్లు + మండలితో కలిపి 1,27,367 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి
తెలంగాణలో మొత్తం 1,839 స్థలాలలో 3,117 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 392 కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని, వారంవారీ సాప్తాహిక్ మిలన్లు 382, నెలవారీగా 224 శాఖలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ కలిపి తెలంగాణలో 3,800 పైచిలుకు శాఖలు నడుస్తున్నాయని, . స్లమ్స్లో సేవాబస్తీల పేరిట సంఘకార్య విస్తరణ ప్రయత్నం జరుగుతోందంటూ తెలంగాణలోని పలు సేవాబస్తీలలో శాఖల ద్వారా 980కి పైగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
తీర్మానాల విశేషాలు ఈ సందర్భంగా వివరించారు.
ఇక బంగ్లాదేశ్లోని మైనార్టీలు, ప్రత్యేకించి హిందువులపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ అఖిలభారత ప్రతినిధి సభలో చేసిన తీర్మానం గురించి రమేష్ మీడియాకి తెలియజేశారు. ఇస్లామిక్ జిహాదీలు హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు, హిందువుల ఆస్తుల లూటీ, గృహదహనాలు తదితర పరిణామాలను, ఈ హింసాకాండను నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజం తీసుకోవలసిన చర్యల గురించి ప్రస్తావించారు.
అదే సమయంలో పోర్చుగీసువారిపై పోరాడిన భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి అబ్బక్క 500వ జయంతిని సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హొసబాళె విడుదల చేసిన ప్రకటన, గత ఏడాది రాణి అహల్యా బాయి 300వ జయంతి సందర్భంగా నిర్వహించిన సామాజిక సమరసత కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ల వితరణ గురించి వివరించారు.
నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్-డిసెంబర్-జనవరి నెలల్లో దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను అందిస్తామన్నారు. ఇదే కార్యక్రమాన్ని తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయితీలోను, ప్రతి బస్తీలోనూ, ప్రతి మూల మూలనా అందరినీ కలుపుకుని వెళ్లేలా కరపత్రం, పుస్తకం పంపిణీ ద్వారా నిర్వహిస్తామన్నారు. ఇంకా అనేక బస్తీలు, ఉపమండలాలు, బ్లాక్ స్థాయిలోను, నగరాలలో ప్రతి లక్షమంది ఒక యూనిట్గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని, ఇందులో స్థానిక నేతలు, హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.మనమంతా ఒక్కటేననే ఏకాత్మ భావనను, సమరసతను ప్రేరేపించేలా ప్రతి బ్లాక్లోను వివిధ సంస్థలు, మఠాలు, కులాల ప్రముఖ వ్యక్తుల భాగస్వామ్యంతో సామాజిక సద్భావన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇంకా, పర్యావరణ హితం, స్వదేశీ జీవన విధానాన్ని పాటించడం, సామాజిక అనుశాసనం, చట్టాలను పాటించడం, హిందూ కుటుంబాలను కాపాడటం వంటి అంశాలను తీసుకుని సామాజిక సద్భావన సదస్సులు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. అదే క్రమంలో జిల్లా కేంద్రాలు, నగర కేంద్రాలలో ప్రతిష్ఠిత వ్యక్తులు, యువకులతో సదస్సులు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో గ్రామగ్రామానికి శాఖను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముందే తెలంగాణలో ప్రతి ఉపమండలం, బస్తీలో అన్నింటా కలిపి శాఖల సంఖ్యను 4 వేలకు చేర్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.
వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఘ్ కార్యం ఉంటూ వస్తోందని వివరించారు.
ఈ ప్రెస్ మీట్ లో ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖు నడింపల్లి ఆయుష్, ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్ట రాజు గోపాల్ పాల్గొన్నారు.