శ్రీరామ నగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల విశేషాలను మోహన్ భగవత్, శివరాజ్సింగ్ చౌహాన్కు వివరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. అనంతరం సమతామూర్తి ప్రాంగణం ముందు భగవద్రామానుజుల జీవిత చరిత్ర త్రీ డీ షోను వీక్షించారు.
సాయంత్రం యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞంలో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దంపతులు. ప్రధాన యాగ మండపంలో కంకణం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, శివరాజ్ సింగ్ చౌహాన్ను సత్కరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వారికి మంగళాశాసనాలు అందించారు, అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
అంతకుముందు ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్యర్యంలో ధర్మాచార్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత భయ్యాజీ జోషి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 385 మంది సాధుసంతులు, పీఠాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు.
హిందూ పురాణాలు సమానత్వాన్ని నేర్పాయన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ. వేల ఏళ్ల నుంచే హిందూ సంస్కృతిలో సమానత్వం ఉందన్నారు. అందరినీ సమానంగా చూడటమే కాదు ఆత్మబంధువుల్లా చూడటమే హిందూ సంప్రదాయమన్నారు. వెయ్యేళ్ల నుంచి ఎన్నో దండయాత్రలను ఎదుర్కొన్న చరిత్ర హిందూ మతానిదన్నారు మోహన్ భగవత్జీ. సనాతన ధర్మం ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందన్నారు. మనం వసుధైక కుటుంబం అని అనుకుంటున్నాం కానీ అంతటా అలా లేదన్నారు మోహన్ భగవత్. హిందూ మతాన్ని దెబ్బతీయాలనుకున్నవాళ్లే దెబ్బతిన్నారన్నారు. హిందూ సమాజం ఇతరులతో శతృత్వం పెట్టుకోదన్నారు. భాష, ప్రాంతం, సంప్రదాయాలు వేరైనా భారతీయులంతా ఒకటేనన్నారు. హిందువుల ఐక్యతే హిందుత్వానికి బలమన్నారు మోహన్ భగవత్జీ. హిందువుల నినాదం సమాజ హితం కావాలన్నారు. రామానుజాచార్యుల విశాల విగ్రహం సమతా స్ఫూర్తిని చాటిచెబుతుందన్నారు. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని సరైన సమయంలో స్థాపించి భాగ్యనగరం పేరును సార్థకత వచ్చిందని కొనియాడారు ఆర్ఎస్ఎస్ చీఫ్.
ఇక భగవద్రామానుజుల 216 అడుగుల ప్రతిమ సమానత్వానికి ప్రతీక అన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహన్. సమతామూర్తి కేంద్రం అందరికీ ప్రేరణ ఇస్తుందన్నారు. అందరూ లక్ష్మీనారాయణ సంతానమేనన్న శివరాజ్ సింగ్ చౌహాన్.. కులాల పేరుతో హిందూ సమాజం చీలిపోవద్దన్నారు. కుల విభేదాలు సమసిపోవాలన్నారు. రామానుజాచార్యులు మనుషులంతా ఒక్కటేనని చెప్పారన్నారు చౌహాన్. అందరికీ ముక్తి లభిస్తుందంటే తాను నరకానికి వెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించిన మహోన్నతమూర్తి రామానుజాచార్యులని అన్నారు. భగవద్రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీపై ప్రశంసలు కురిపించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. లోకకల్యాణానికి చిన్నజీయర్ స్వామీజీ శ్రీకారం చుట్టారన్నారు చౌహాన్.
మానవుల్లో ఉన్న అసమానతలు అనే వైరస్ను తొలగించి సమతను పెంపొందించేందుకే సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. అందుకే శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కూడా చేస్తున్నామన్నారు. తమ ఆచారాలను గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించేవారే నిజమైన వైదికులన్నారు చిన్నజీయర్ స్వామి. ఇక గురువారం
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీరామనగరిని సందర్శించనున్నారు.