షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని త్యజించి హిందూ మతం స్వీకరించారు. ఘజియాబాద్లోని దాస్నా దేవి ఆలయంలో మహంత్ యతి నరసింహానంద గిరి సమక్షంలో హిందూ మతంలోకి మారాడు. తన పూర్వీకుల మతంలోకి తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు రిజ్వీ.అయితే మతం మారిన తరువాత ఆయన తనపేరును జితేంద్ర నారాయణ స్వామిగా మార్చుకున్నాడు.
మొఘలులు భారతదేశంపై దండెత్తి ఎంతోమందిని మతం మార్చారని…ఇప్పుడు తాను తిరిగి హిందుమతంలోకి వచ్చానని అన్నారు. ఇప్పుడిక కొందరు నన్ను లక్ష్యంగా చేసుకుంటారని తెలుసు అని వ్యాఖ్యానించారు. తాను సనాతన హైందవాన్ని స్వీకరిస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు రిజ్వీ. చాలా రోజులుగా స్వామీ మహంత్ తో ఆయన టచ్లో ఉంటున్నారు. తానెప్పుడు చనిపోయినా దహనసంస్కారాలు మాత్రమే చేయాలనే కోరికను గతంలోనే వ్యక్తం చేశారు. అంతేకాదు తను చనిపోతే దహనక్రియలు చేసే అధికారాన్ని దాస్నా ఆలయానికి చెందిన మహంత్కు , జునా అఖారా యతి నరసింహానంద సరస్వతికి చెందిన మహామండలేశ్వరుడికి ఇచ్చాడు. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రిజ్వీ మృతదేహానికి తమ శ్మశానంలో చోటు ఉండదని కొందరు ముస్లిం పెద్దలు ప్రకటించడంతో ఆయనీ స్టేట్ మెంట్ ఇచ్చారు.
హిందూ ఆచారాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ అధికారులకూ లేఖపంపారు గతంలోనే రిజ్వీ.
ఇటీవల, రిజ్వీ తన ‘మహమ్మద్’ పుస్తకాన్ని దాస్నా మహంత్ సమక్షంలో ఆవిష్కరించారు. అందులో ప్రవక్తను కించపరిచారంటూ…ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రిజ్వీపై ఫిర్యాదు చేశారు. అంతకుముందు, రిజ్వీ ఖురాన్ నుంచి 26 వాక్యాలను తొలగించాలని పిల్ వేస్తూ… ఆ వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు. షియా వక్ఫ్ బోర్డు అధినేతగా అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిరం కోసం చేస్తున్న పోరాటానికి రిజ్వీ తన మద్దతు తెలిపారు.