జైళ్లలో చెలరేగిన అల్లర్లు.. 62 మంది ఖైదీలు మృతి.. పోలీసులకు గాయాలు..
జైలులో చెలరేగిన అల్లర్లు 62 మంది ఖైదీల ప్రాణాలు బలిగొన్నాయి. ఈ సంఘటన ఈక్వెడార్లోని పశ్చిమ ఓడరేవు నగరమైన గుయాక్విల్లో చోటుచేసుకుంది. రెండు ముఠాల మధ్య చెలరేగిన చిన్న ఘర్షణ పెద్ద అల్లర్లకు దారితీసినట్లు తెలుస్తోంది. జైళ్ల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ క్యూంకాలోని జైలులో 33 మంది మరణించగా.. లాటాకుండాలో 8 మంది మరణించినట్లు తెలుస్తోంది.
జైళ్లలో ఖైదీల మధ్య జరిగిన ఈ ఘర్షణలతో ఈక్వెడార్ పోలీసులు సంఘటనా స్థలాలకు మిలటరీని రంగంలోకి దించారు. అల్లర్లను అదుపుచేసే క్రమంలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. జైలులో ఉన్న పలువురు ఖైదీల వద్ద తుపాకీలు ఉండటం కలకలం రేపుతోంది. ఇద్దరు ఖైదీల నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే జైలులో సామర్ధ్యం కంటే ఎక్కువ మందిని కూడా ఉంచడం.. వారిని పర్యవేక్షించడానికి సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఓ సమస్యగా మారింది. 29వేల సామర్ధ్యం ఉన్న జైలులో దాదాపు 38 వేల మంది వరకు ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది.వీరిన పర్యవేక్షించడానికి కేవలం 1500 మంది మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. దీంతో పలుసార్లు ఖైదీల తిరుగుబాటు చేశారు. ప్రస్తుతం జైళ్లలో జరిగిన అల్లర్ల కారణంగా 90 రోజుల పాటు ఎమర్జెన్సీని ప్రకటించారు. కాగా,గతేడాది కూడా జైళ్లలో జరిగిన ఘర్షణలో 51 మంది ఖైదీలు మరణించారని ఈక్వెడార్ పోలీసులు తెలిపారు.