ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడెలను సమర్పించి మొక్కు తీర్చుకున్నారు . ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మోదీతో ప్రత్యేకంగా పూజలు చేయించి రాజన్నకు హారతులు ఇప్పించారు. ఆలయంలోని నందీశ్వరుడికి పూజలు చేయించారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో నరేంద్ర మోదీ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరారు.
అయితే ఇక్కడ ఒక నెగెటివ్ సెంటిమెంట్ ను గుర్తు చేసుకోవాలి. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ మీద కొంతకాలంగా నెగటివ్ సెంటిమెంట్ ని రాజేస్తున్నారు. గత కాలంలో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పదవి పోగొట్టుకున్నారు అంటూ ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. దీంతో గడచిన 20 30 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రీ వేములవాడలో అడుగుపెట్టలేదు. కానీ ఇటువంటి నెగిటివ్ మాటల్ని దూరం పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భక్తిశ్రద్ధలతో వేములవాడ వచ్చారు. రాజన్నకు చక్కగా పూజలు చేయించుకున్నారు. వేములవాడలో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి ఈ మహిమాన్విత క్షేత్రాన్ని సందర్శించలేదు. మొత్తం మీద వేములవాడ రాజన్న స్వామి మీద చేస్తున్న నెగిటివ్ ప్రచారానికి మోడీ అడ్డుకట్ట వేశారని అనుకోవచ్చు.