ధనిక రాష్ట్రం.. ఇదేం దరిద్రం!
గుజరాత్ తర్వాత సంపన్న రాష్ట్రం మనదే అని 2014లో సీఎం కెసిఆర్ చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు సంబరపడ్డారు. కొట్టాది తెచ్చుకున్న రాష్ట్రం ధనికంగా అవిర్భవించినందుకు గర్వపడ్డారు. కేవలం ఆరున్నర ఏళ్లలో ఇది ఇప్పుడు దివాళా అంచున కనిపిస్తోంది. బీద తెలంగాణగా గోచరిస్తున్నది. కరోనా పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల పాటు జీతంలో సగం కోత విధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ధనిక తెలంగాణ దౌర్భాగ్యం అందరికీ బాధ కలిగించింది. ఇప్పుడు ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం వెనుక కూడా ఖజానా ఖాళీ అనే సంకేతాలనే ఇస్తున్నది. లక్షల మంది ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ అయితే వాళ్లకు బోలెడన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి. కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం అమలు అవుతున్న కారణంగా ప్రతి ఒక్కరికీ భారీగానే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అసలే ఖజానా ఖాళీ. ఆరోగ్యశ్రీ, విద్యార్థుల స్కాలర్ షిప్పులు, రైతు రుణ మాఫీ వంటి వాటికే కష్టంగా ఉంది. కాబట్టే రిటైర్మెంట్ వయసు పెంచారనేది ఒక వాదన. ఖజానా పరిస్థితి తెలిసిన వారికి ఇది నిజమే అనిపించడం సహజం. వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయం వస్తున్నా చాలడం లేదు. బెల్ట్ షాపులను పెంచడం ద్వారా ప్రజలకు మద్యం తాగించడమే లక్ష్యం అన్నంత దారుణమైన పరిస్థితి బహుశా మరే రాష్ట్రంలోనూ లేదేమో.
కాళేశ్వరం కావాలా శనేశ్వరం కావాలా అనేది ఒకప్పుడు కెసిఆర్ అన్న మాట. ఇప్పుడు కాళేశ్వరం పేరుతో ప్రభుత్వం శనేశ్వరంగా మారిందనేది ప్రతిపక్షాల విమర్శ. లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకూ నిజంగా ఒక్క ఎకరానికి కూడా సాగు నీరు రాలేదని విపక్ష నేతలు, పలువురు ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు. సుపరిపాలనకు బదులు దారి తప్పిన పాలన, నియంత పోకడల వల్ల రాష్ట్రం దివాళా అంచుకు చేరింది. సుమారు 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేసినట్టు అంటే జవాబు లేదు. ప్రతి దానికీ అతికి పోయి, భేషజాల కారణంగా ప్రజలపై రుణభారం పెంచడం మినహా గత ఆరున్నర ఏళ్లలో ప్రభుత్వం సాధించింది ఏమీ కనిపించడం లేదు. ఆరేళ్లుగా టీచర్ల నియామకాలు లేని రాష్ట్రం బహుశా తెలంగాణ ఒక్కటే కావచ్చు. పక్కన లోటు బడ్జెట్ రాష్ట్రం ఏపీలో ఇప్పటి వరకు మూడు సార్లు డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాలు జరిగాయి.
తెలంగాణలో లక్షన్నరకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ముఖ్యమంత్రికి చలనం లేదు. విద్య, పోలీస్, ఇతర శాఖల్లో భారీగా ఖాళీలున్నా భర్తీ చేసిన పాపాన పోలేదు. పబ్లిక్ సర్విస్ కమిషన్ నామమాత్రంగా మారినా కొందరికి నామినేటెడ్ పోస్టుల కోసం ఉపయోగ పడింది. రైతులు సంతోషంగా లేరు. సీఎం మాట విని సన్న వడ్ల రైతులు నిండా మునిగినా పట్టించుకునే దిక్కు లేదు. ఏ శాఖలో, ఎలాంటి రంగంలో చూసినా అంతా తిరోగమనమే కనిపిస్తున్నది. రిటైర్మెంట్ వయసు పెంచడం అంటే నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లడమే. అంటే మరికొంత కాలం నిరుద్యోగ తెలంగాణగా ఈ రాష్ట్రం బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిందేనా అనేది యువతకు ఆందోళన కలిగిస్తున్న వాస్తవం.