తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకుని మరీ పనిచేస్తున్నారు. శాసనమండలి లో కాంగ్రెస్ పార్టీకి బలం పెంచేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. కీలకమైన బిల్లులు పాస్ చేయించుకోవాలి అంటే మండలి లో ప్రభుత్వానికి బలం అవసరం . అందుచేత రేవంత్ రెడ్డి చక చక పావులు కదుపుతున్నారు.
శాసనమండలిలో సభ్యుల కోసం కాంగ్రెస్ పార్టీ వెతుకుతోంది. శాసనమండలిలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి మరో ఐదుగురు వరకు అవసరం ఉంటుంది. మొత్తం 40 సభ్యులు ఉన్న శాసన మండలిలో ఆరుగురు నామినేటెడ్ సభ్యులు. ఇందులో రెండు ఖాళీగా ఉన్నాయి. నలుగురు నామినెటెడ్ సభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ ఇద్దరు, బీఆర్ ఎస్ ఇద్దరు ఉన్నారు. మిగిలిన 34 సభ్యులు ఎన్నికైన వారు. ఇందులో బీఆర్ఎస్ కు 26 మంది సభ్యులుండగా, కాంగ్రెస్ పార్టీ ఆరుగురున్నారు. రంగా రెడ్డి జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మేల్సీ గా గెలిచిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్న కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా అడపా దడపా ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 12 కు చేరింది. మరో ఐదుగురు వరకు బలం కావాల్సి ఉంటోంది.
వలసలకు సంబంధించి రేవంత్ రెడ్డికి స్పష్టమైన వ్యూహం ఉందని చెబుతున్నారు. దీనిమీద చెడ్డపేరు రాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బలం పెంచుకోవడం కోసం వలసలను ప్రోత్సహించారని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా, అలాగే పార్టీ పరంగా బలం పెంచుకుంటే సీఎం పీఠం కదిలే పరిస్థతి ఉండదు. ఆమేరకు తన కార్యాచరణ అమలు చేస్తున్నారన్నదే చర్చ. జాతీయ పార్టీల నుంచి వలసలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల నుంచి అధికార పార్టీల వైపు వలసలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వలసలు అన్ని అలానే జరుగుతున్నాయి. ఊహకు అందని విధంగా జరగడం అంతుపట్టడం లేదని పలువురు రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు.
మొత్తం మీద ఈ వారం పది రోజుల్లోనే మరో అయిదుగురిని కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి తెచ్చేస్తారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.