వైసీపీకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా చేసుకుని వైసిపిని ముప్పుతిప్పలు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలోని వైసిపి కేంద్ర కార్యాలయం దగ్గర నిర్మాణాల్ని తెల్లవారుజామున ఒక్కసారిగా కూల్చివేశారు. వైసీపీ శ్రేణులు బాబోయ్ బాబోయ్ అని గుండెలు బాదుకుంటూ ఉండగానే కూల్చివేత పనులు చక చక జరిగిపోయాయి.
నిజానికి ప్రభుత్వం తలుచుకుంటే దెబ్బలకు కొదవ ఏముంది అని ఒక సామెత చెప్పుకోవచ్చు. ఒక భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయాలి అని ఫిక్స్ అయితే చాలా నిబంధనలు చేతిలోకి వచ్చేస్తుంటాయి. అదే మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా నిబంధనలతోనే కూల్చివేతలు చేపట్టింది.
గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా వ్యవహరించింది. మున్సిపల్ శాఖలోని కొన్ని నిబంధనలను చూపించి చాలా భవనాలు కోలగొట్టింది. శనివారం తెల్లవారుజామున బుల్డోజర్ల పంపించడం పది పదకొండు గంటల సమయానికల్లా కూల్చివేతలు పూర్తి చేయడం చేసేవారు. శనివారం తెల్లవారుజాము సమయం కావడంతో బాధితులు కోర్టుకి పరిగెత్తాలన్నా కూడా వీలుకాని పరిస్థితి. దీంతో కూల్చివేతలు సజావుగా జరిగిపోయినవి.
ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా శనివారం తెల్లవారుజామునే ముహూర్తం పెట్టుకోంది. తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయాన్ని ఉదయాన్నే కూల్చి వేయించింది. ఈ స్థలం వెనక చాలా వివాదం దాగి ఉంది.
బ్రిటిష్ హయాంలో ఇరిగేషన్ శాఖ స్థలంలో బోటు యార్డ్ ఏర్పాటు చేసింది. ఈ బోట్ యార్డ్ వద్దే పడవలకు మరమ్మతులు చేసి జల రవాణా చేసేది. ఈ స్థలంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కు మంచినీళ్లు కల్పించేందుకు ప్లాంట్ పెడతానని ప్రభుత్వానికి అప్పటి మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు.
దానితో ఈ స్థలం గురించి తెలుసుకున్న వైసిపి పెద్దలు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో కొట్టేసే ప్రయత్నం జరిపారు. జగన్ పాలనలో అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజుతో కైవసం చేసుకున్నారు.
ఉండవల్లిలోని బోట్ యార్డ్ స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం లీజుకి జగన్ సర్కార్ కట్టబెట్టింది. అప్పట్లో టిడిపి, జనసేన తీవ్ర అభ్యంతరం తెలిపాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభించారు. అయితే నిర్మాణం అక్రమం అంటూ ఇటీవలి సీఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూల్చివేతకు సీఆర్డీఏ తయారు చేసిన ప్రాథమిక ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైసీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన హైకోర్టు చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని సీఆర్డీఏని ఆదేశించింది.
తాడేపల్లిలో 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి గత జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెబుతున్నారు. సీఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైఎస్సార్సీపీకి అప్పగించలేదని చెబుతున్నారు. అంతేకాదు వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదంటున్నారు అధికారులు. నీటిపారుదల శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారంటున్నారు.
కాగా, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తూ కూటమి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ కోర్టు ధిక్కారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయటంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు.ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని జగన్ ఆక్షేపించారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదని, వెన్నుచూపేది అంతకన్నా లేదని స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలోని మరికొన్ని పట్టణాల్లో కూడా వైసిపి కార్యాలయాలను ప్రభుత్వం గుర్తించింది. నోటీసు ఇచ్చి వాటిని కూడా కూల్చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేయోభిలాషుల భవనాన్ని వైసిపి ఇదే మాదిరిగా కూల్చి వేయించింది. ఇప్పుడు వైసీపీకి తెలుగుదేశం ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.